అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా ఈ డిసెంబర్లో ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.
ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు మంగళవారం(ఆగస్ట్ 27) ఆఖరి రోజు కాగా.. జై షా రేసులో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకురాలేదు. దాంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. దాంతో ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనకు ఈ అత్యున్నత పదవి వరించింది.

ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు జై షా కన్నా ముందు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన జై షా ఎంత జీతం తీసుకుంటారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అధ్యక్ష పదవితో పాటు సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ పోస్ట్లకు ఎలాంటి ఫిక్స్డ్ సాలరీలను నిర్ణయించలేదు. ఈ పదవులను గౌరవ ర్యాంకులుగానే పరిగణిస్తోంది. కాకపోతే బీసీసీఐకి సంబంధించిన పనులకు అలవెన్స్లు చెల్లిస్తోంది.
బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా విదేశాల్లో జరిగే ఐసీసీ మీటింగ్స్కు హాజరైనప్పుడు.. ఇతర క్రికెట్ పర్యటనలకు వెళ్లినప్పుడు డైలీ అలవెన్స్గా రూ. 84 వేలు బోర్డు చెల్లించేది. భారత్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు రూ. 40 వేలు చెల్లించడంతో పాటు విమాన ఖర్చులు బీసీసీఐ భరిస్తోంది. బిజినెస్ క్లాస్ టికెట్స్నే కేటాయిస్తోంది. మీటింగ్స్ కాకుండా ఇతర క్రికెట్ అసోసియేషన్స్ సందర్శించేందుకు వెళ్లినప్పుడు జై షాకు రూ. 30 వేల డైలీ అలవెన్స్ ఇచ్చేవారు.
బీసీసీఐలానే ఐసీసీ కూడా తమ ఆఫిస్ బేరర్స్కు ఎలాంటి ఫిక్స్డ్ సాలరీలు ఇవ్వడం లేదు. కాకపోతే వారికి వివిధ అలవెన్స్లతో పాటు బెన్ఫిట్స్, రీయంబర్స్మెంట్స్ సదుపాయాలు కల్పిస్తోంది. అయితే ఐసీసీ ఇప్పటి వరకు ఈ అలవెన్స్లకు సంబంధించిన వివరాలను బయటకు చెప్పలేదు. అయితే జై షా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు కావాల్సిన అన్ని అలవెన్స్లతో పాటు సకల సౌకర్యాలు దక్కనున్నాయి.