ప్రపంచంలోనే అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెట్ లీగ్.. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). గతేడాదే ఈ క్యాష్ రిచ్ లీగ్ బ్రాండ్ వాల్యూ రూ. లక్ష కోట్లు దాటింది. మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐకి రూ. 48 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ప్రతీ సీజన్లో బీసీసీఐకి బ్రాడ్కాస్టర్స్ నుంచి రూ. 12 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. గతేడాది పది ఐపీఎల్ టీమ్స్ ద్వారా రూ.6,797 కోట్ల రెవెన్యూ వచ్చింది.
ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నా.. ప్రత్యక్ష పన్నులు చెల్లించుకుండా బీసీసీఐకి భారత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దేశంలో లీగ్ క్రికెట్ను ప్రోత్సహించేందుకు ఎలాంటి లాభా పేక్ష లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని బీసీసీఐ.. ఇన్కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)కి అప్పీల్ చేయడంతో ఈ మినహాయింపు లభించింది. దాంతో ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఆదాయం రెట్టింపు అయ్యింది.

ప్రత్యక్ష పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చినా.. ఆటగాళ్ల జీతాల ద్వారా కోట్ల రూపాయాల పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా భారత ప్రభుత్వానికి టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ సోర్ట్స్) కింద సుమారు రూ.90 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ టీడీఎస్ను ప్రభుత్వం.. భారత ఆటగాళ్ల జీతాల్లో నుంచి 10 శాతం, విదేశీ ఆటగాళ్ల జీతాల్లో 20 శాతం తీసుకుంటుంది. ఐపీఎల్ 2025 సీజన్లో పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారత ఆటగాళ్లకు మొత్తం రూ. 383.4 కోట్లు చెల్లించాయి.
ఈ లెక్కన ప్రభుత్వానికి రూ. 38.4 కోట్లు టీడీఎస్ కింద చేరనుంది. విదేశీ ఆటగాళ్లకు పది ఫ్రాంచైజీలు రూ. 255.75 కోట్లు చెల్లించనుండగా.. 20 శాతం టీడీఎస్ ప్రకారం రూ. 51.15 కోట్ల పన్ను రూపంలో వసూలు చేయనుంది. మొత్తం ఆటగాళ్ల జీతాల్లో నుంచి రూ. 89.49 కోట్లు భారత ప్రభుత్వానికి రానున్నాయి. లీగ్కు ఉన్న ఆదరణ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ఆదాయం రెట్టింపు అవ్వనుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చినా.. ఆటగాళ్ల జీతాల నుంచి రూ.90 కోట్ల ఆదాయమే భారత ప్రభుత్వానికి వస్తున్నా.. పరోక్ష పన్నుల రూపంలో కోట్ల రూపాయాలు ప్రభుత్వ ఖజానాలో చేరనున్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ చుట్టూ వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది.