ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4 మ్యాచ్లోనూ పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో పాక్ను చిత్తు చేసిన భారత్.. సూపర్ 4 పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ జోరు ముందు పాకిస్థాన్ తేలిపోయింది. తొలి లీగ్ మ్యాచ్ను జనాలు పెద్దగా పట్టించుకోపోయినా.. రెండో మ్యాచ్కు భారీ ప్రేక్షకాదరణ లభించింది. దాంతో భారత్, పాకిస్థాన్ జట్లు మళ్లీ తలపడుతాయా? అనే చర్చ మొదలైంది.
అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. అది ఎలా అంటే ఇరు జట్లు ఫైనల్కు చేరడం. పాకిస్థాన్పై గెలుపుతో సూపర్ 4 పాయింట్స్ టేబుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్లో ఈ రెండు జట్లను ఓడించడం భారత్కు పెద్ద కష్టమేం కాదు. మెరుగైన రన్రేట్తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఫైనల్కు చేరుకుంటుంది.

మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్థాన్కు మాత్రం ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్ల్లో శ్రీలంక, బంగ్లాదేశ్లను ఓడించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్ ఫైనల్ చేరితే ఆదివారం(సెప్టెంబర్ 28) జరిగే టైటిల్ ఫైట్లో మూడోసారి అమీతుమీ తేల్చుకుంటాయి. పాకిస్థాన్ను ఓడించే టైటిల్ సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పాకిస్థాన్ ఫైనల్ చేరడం అంత సులువైన పనికాదు.
శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాక్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ చేరకుంటే.. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ 2026లోనే తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్ చేరకుంటే.. భారత్-పాక్ పోరు కోసం అభిమానులు ఏడాది పాటు నిరీక్షించాల్సిందే.