సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లోనూ భారత్ తేలిపోయింది. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 489 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్ల వైఫల్యంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు.
247/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓవర్నైట్ బ్యాటర్లు ముత్తుసామి, కైల్ వెర్రెన్ (122 బంతుల్లో 5 ఫోర్లతో 45) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి సెషన్ను ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఏడో వికెట్కు 88 పరుగులు జోడించింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరకు కైల్ వెర్రెన్(45)ను జడేజా ఔట్ చేసినా.. మార్కో జాన్సన్తో కలిసి ముత్తుసామి చెలరేగాడు.

192 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ముత్తుసామి.. 8వ వికెట్కు 97 పరుగులు జోడించారు. సిమన్ హర్మర్(5)తో కలిసి 9వ వికెట్కు 31 పరుగులు జోడించిన జాన్సన్.. ఆఖరి వికెట్కు 27 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా లోయరార్డర్ అద్భుత బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా విజయవకాశాలు దెబ్బతిన్నాయి.
ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే అద్భుతం జరగాలి. సౌతాఫ్రికా 489 పరుగులు చేసేందుకు 151 ఓవర్లు ఆడింది. భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే దూకుడుగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్లో 650 700 పరుగుల భారీ స్కోర్ చేయాలి. నాలుగో రోజు లంచ్ బ్రేక్ వరకు బ్యాటింగ్ చేసి.. ఆ తర్వాత సౌతాఫ్రికాను ఆలౌట్ చేయాలి. అలా కాకుండా భారత్ తక్కువ స్కోర్కే పరిమితమైతే సౌతాఫ్రికాకు విజయవకాశాలు మెరుగవుతాయి. ఇరు జట్లు పోటా పోటీగా ఆడితే మ్యాచ్ ఫలితం లేకుండా ముగుస్తుంది. అదే జరిగితే ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది. భారత బౌలర్ల వైఫల్యం భారత జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.