మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్.. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించింది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది.
ఈ ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న భారత్.. తమ తదుపరి మ్యాచ్ల్లో పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది. హర్మన్సేన సెమీస్ చేరాలంటే ఈ మూడు మ్యాచ్లు గెలవడంతో పాటు మెరుగైన రన్రేట్ సాధించాలి. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో భారత్ రన్రేట్ -2.900 నెగటీవ్గా మారింది.

ప్రస్తుతం భారత్ గ్రూప్-ఏలో చిట్ట చివరి స్థానంలో ఉంది. చివరి మూడు మ్యాచ్లు గెలిచినా.. ఇతర జట్ల నెట్రన్రేట్పై భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. మరో బెర్త్ కోసం భారత్.. పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్తో పోటీపడాల్సి ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లు రెండేసి మ్యాచ్లు ఓడాలి. వాటి రన్రేట్ మనకంటే తక్కువగా ఉండాలి. అప్పుడే భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. లేకుంటే ఇంటిదారి పడుతోంది. టీమిండియా తమ తుదపరి మ్యాచ్ ఆదివారం పాకిస్థాన్తో ఆడనుంది.
ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్(36 బంతుల్లో 7 ఫోర్లతో 57 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. జార్జియో ప్లిమ్మర్(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) వేగంగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(2/27) రెండు వికెట్లు తీయగా.. అరుందతి రెడ్డి, ఆశా సోభనా తలో వికెట్ తీసారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధానా(12), ఫెఫాలీ వర్మ(2)తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15), జెమీ రోడ్రిగ్స్(13), రిచా ఘోష్(12), దీప్తి శర్మ(13) దారుణంగా విఫలమయ్యారు. తెలుగు తేజం అరుందతి రెడ్డి(1) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా 19 ఓవర్లలోనే ఆలౌటయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్(4/19) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. లీ తహుహు(3/15) మూడు వికెట్లు పడగొట్టింది. ఈడెన్ కార్సన్కు రెండు వికెట్లు .. అమెలియా కేర్కు ఓవికెట్ దక్కింది.