ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 35 బంతుల్లోనే సెంచరీ సాధించి టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఈ 14 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. దాంతో టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ సెంచరీ నేపథ్యంలో అతన్ని పట్టు బట్టి వేలంలో కొనుగోలు చేయడంతో పాటు తుది జట్టులో అవకాశం ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
టీమిండియాకు ప్రతిభ కలిగిన కుర్రాళ్లను అందించడంలో రాహుల్ ద్రవిడ్కు తిరుగులేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే.. సూర్యవంశీ ప్రతిభను గుర్తించి అతని గురించి రాహుల్ ద్రవిడ్కు చెప్పిందే తెలుగు తేజం, హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్.

వీవీఎస్ లక్ష్మణ్ లేకుంటే సూర్యవంశీ ఇక్కడి వరకు వచ్చేవాడే కాదు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్.. భారత్-ఏతో పాటు అండర్ 19 జట్లకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. భారత అండర్ 19 జట్టుకు సూర్యవంశీ ఆడే సమయంలోనే లక్ష్మణ్ అతని ప్రతిభను గుర్తించాడు. అండర్ 19 వన్డే ఛాలెంజర్ టోర్నీలో ఓ మ్యాచ్లో రనౌట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ వెక్కి వెక్కి ఏడ్చాడు. మళ్లీ తనకు అవకాశం రాదని బాధపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీ ఏడ్వడం గమనించిన వీవీఎస్ లక్ష్మణ్ అతనికి ధైర్యాన్నిచ్చాడు. ఇక్కడ తాము పరుగులే చూడమని, ప్రతీ ఆటగాడిలో సుదీర్ఘ కాలం ఆడే ప్రతిభ ఉందో లేదో కూడా పరిశీలిస్తామని చెప్పాడు. స్ఫూర్తి దాయకమైన మాటలతో అతనికి ధైర్యాన్నిచ్చాడు. సూర్యవంశీ ఆటను దగ్గరగా గమనించిన లక్ష్మణ్.. రాహుల్ ద్రవిడ్కు అతని గురించి సమాచారమిచ్చాడు. రాహుల్ ద్రవిడ్.. రాజస్థాన్ స్కౌట్స్ చేత అతన్ని ప్రాక్టీస్ క్యాంప్స్కు రప్పించాడు. ఒకే ఓవర్ అతని బ్యాటింగ్ చూసి వైభవ్లోని ప్రతిభను పసిగట్టి వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేశాడు. రాహుల్ ద్రవిడ్తో పాటు లక్ష్మణ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వైభవ్ సూర్యవంశీ నిలబెట్టుకున్నాడు.