ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతని సతీమణి రితికా సజ్దేలతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ నఫీజ్ ఇక్బాల్ తెలిపాడు.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సోదరుడైన నఫీజ్ 2018 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి పని చేశాడు. ఆ సీజన్లో ముంబై తరఫున బరిలోకి దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్కు ట్రాన్స్లేటర్గా వ్యవహరించాడు.
దీంతో టీమ్ కెప్టెన్ అయిన రోహిత్తో తరుచూ మాట్లాడేవాడు. అలా రోహిత్తో తనకు మంచి బంధం నెలకొందని, రోహిత్ సతీమణి కూడా క్లోజ్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రోహిత్ ఫ్యామిలీ ఒక్కటే కాదని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరి భార్యలు తనతో చాలా బాగా మాట్లాడుతారని, అందరితో చనువు ఉందన్నాడు. మ్యాచ్లు జరుగుతున్నప్పుడు వారితో డగౌట్స్లో కూర్చోని మాట్లాడటంతో మంచి స్నేహం ఏర్పడిందన్నాడు.
'నా ఉద్యోగ రిత్యా నేను ఎప్పుడూ జట్టుతోనే ఉండేవాడిని. కానీ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు మాత్రం నిబంధనల మేరకు టికెట్ కొనుక్కొని ఆటగాళ్ల ఫ్యామిలీ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్లు వీక్షించేవాడిని. బీపీఎల్లో కూడా ఇలానే జరిగేది. దాంతో ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు క్లోజ్ అయ్యారు. కేవలం రోహిత్ వైఫ్ మాత్రమే కాదు. పొలార్డ్ వైఫ్, ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యులతో కూడా మంచి స్నేహం ఏర్పడింది. కెప్టెన్ రోహిత్ నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. నేను తరుచూ అతనితో మాట్లాడేవాడిని. జట్టులోని ఇతర ఆటగాళ్లతో కూడా నాకు మంచి సంబంధాలే ఉన్నాయి.'అని నఫీజ్ చెప్పుకొచ్చాడు.
2004లో టీనేజర్ బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నఫీజ్.. ఆజట్టు తరఫున 11 టెస్ట్ల్లో 518, 16 వన్డేల్లో 309 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2005లోఆస్ట్రేలియాను ఓడించిన బంగ్లా జట్టులో నఫీజ్ ఓ సభ్యుడు.
పోలీస్ కేసుపై స్పందించిన యువరాజ్ సింగ్!