ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య పోరు వర్షంతో రద్దయ్యింది. ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83), ప్రియాంశ్ ఆర్య(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 69) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/34) రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం కేకేఆర్ తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. భారీ గాలులతో వర్ష పడటంతో మైదానంలో కవర్లు ఏర్పాటు చేయడం కూడా కష్టమైంది. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేసిన అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మరో 4 ఓవర్ల పాటు ఆట సాధ్యమైనా.. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చేవారు.

పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
రద్దయిన ఈ మ్యాచ్ ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఒక డ్రాతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్స్ ఉండగా.. రన్ రేట్ 0.177 మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇంకా 5 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు విజయాలు సాధిస్తే పంజాబ్ ఖాతాలో 17 పాయింట్లు చేరుతాయి.
అప్పుడు ఏ జట్టుతో సంబంధం లేకుండా పంజాబ్కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. అలా కాకుండా రెండు విజయాలు నమోదు చేస్తే మాత్రం ఇరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్తో భారీ స్కోర్ చేసిన పంజాబ్ విజయం సాధించేలా కనిపించింది. ఈ మ్యాచ్ పూర్తిగా జరిగిన విజయం తమ ఖాతాలో చేరి ఉంటే పంజాబ్ ప్లే ఆఫ్స్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది.
తదుపరి మ్యాచ్లు ఏంటంటే..?
పంజాబ్ తదుపరి మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్(ఏప్రిల్ 30), లక్నో సూపర్ జెయింట్స్(మే 4), ఢిల్లీ క్యాపిటల్స్(మే 8), ముంబై ఇండియన్స్(మే 11), రాజస్థాన్ రాయల్స్(మే 16)లతో తలపడనుంది. ఇందులో మూడు మ్యాచ్లను ధర్మశాల వేదికగా ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించాలంటే పంజాబ్ మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే.