ఐపీఎల్ 2025 సీజన్లో కీలక మ్యాచ్ వర్షార్పణమైంది. పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య పోరు వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83), ప్రియాంశ్ ఆర్య(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 69) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/34) రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం కేకేఆర్ తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. భారీ గాలులతో వర్ష పడటంతో మైదానంలో కవర్లు ఏర్పాటు చేయడం కూడా కష్టమైంది. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేసిన అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మరో 4 ఓవర్ల పాటు ఆట సాధ్యమైనా.. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చేవారు.

కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
రద్దయిన ఈ మ్యాచ్ ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 3 విజయాలే నమోదు చేసింది. ఒక మ్యాచ్ రద్దవ్వడంతో 7 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్లకు ఐదు గెలిస్తేనే 17 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఒక్క మ్యాచ్ ఓడితే 15 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే మాత్రం 13 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు... కేకేఆర్ ఫామ్ నేపథ్యంలో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్లు గెలవడం కష్టం. దాదాపు కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే.
తదుపరి మ్యాచ్లు ఏంటంటే..?
కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్(ఏప్రిల్ 29), రాజస్థాన్ రాయల్స్(మే 4), సీఎస్కే(మే 7), సన్రైజర్స్ హైదరాబాద్(మే 10), ఆర్సీబీ(మే 17)లతో తలపడనుంది. ఇందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఒక్క మ్యాచ్ రద్దయినా కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఈ ఐదు మ్యాచ్ల్లో గెలవాలంటే కేకేఆర్ అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.