హైదరాబాద్: ఆసియా దేశాల్లో క్రికెట్ ఆడే దేశాల ఐక్యత కోసం ఏర్పడిన ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. క్రికెట్ విస్తరణే లక్ష్యంగా ఆసియాకప్ను ప్రారంభించింది. ఏసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల మధ్య ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది.
1984లో యూఏఈ వేదికగా తొలి ఎడిషన్ జరగగా.. దుబాయ్ వేదికగానే 1995 వరకు ఏసీసీ తమ కార్యకలాపాలు నిర్వహించింది. అయితే రెండో ఎడిషన్నే (ఆసియాకప్ 1986) భారత క్రికెట్ జట్టు బహిష్కరించింది. శ్రీలంక జట్టుతో నెలకొన్న వివాదాల కారణంగా ఈ ఎడిషన్కు టీమిండియా దూరంగా ఉంది.

భారత్తో ద్వైపాక్షి సంబంధాలు దెబ్బతినడంతో 1990-91 ఎడిషన్ను పాకిస్థాన్ బహిష్కరించింది. ఇరు దేశాల మధ్య యుద్దం జరగడం.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో 1993 ఎడిషన్ను పూర్తిగా రద్దు చేశారు. 1995లో మళ్లీ ఆసియాకప్ టోర్నీ నిర్వహించారు.
అప్పటి నుంచి వరుసగా 1997, 2000, 2004, 2008, 2012, 2014, 2016, 2018, 2022లో ఆసియా కప్ నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా.. ఐసీసీ మెగా టోర్నీల కారణంగా కొన్ని ఎడిషన్స్ ఆలస్యంగా నిర్వహించారు. 2014 వరకు వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్ను 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు.
ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ నిర్వహించాలని 2015లోనే ఏసీసీ నిర్ణయించింది. దాంతోనే 2016, 2022 టోర్నీలు టీ20 ఫార్మాట్లో జరిగాయి. ఈ ఏడాది మళ్లీ వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 15 ఎడిషన్స్లో భారత్ అత్యధికంగా ఏడు సార్లు టైటిల్ గెలవగా.. శ్రీలంక 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది.
పాకిస్థాన్ మాత్రం రెండు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు మొత్తం 14 ఎడిషన్స్ ఆడిన భారత జట్టు.. అరంగేట్రం సీజన్ 1984తో పాటు 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో విజేతగా నిలిచింది. 15 ఎడిషన్స్ ఆడిన శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014, 2022 లో ఛాంపియన్గా నిలిచింది.
14 ఎడిషన్స్ ఆడిన పాకిస్థాన్ 2000, 2012 టైటిల్స్ గెలుచుకుంది. 14 ఎడిషన్సే ఆడిన బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరి (2012, 2016, 2018)రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఆరంభంలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మధ్యనే ఈ టోర్నీ జరగ్గా.. రెండో ఎడిషన్ నుంచి బంగ్లాదేశ్ బరిలోకి దిగింది.
2004లో హాంగ్కాంగ్, యూఏఈ టీమ్లో కూడా ఈ టోర్నీ భాగమవ్వగా.. ఈ ఏడాది నెపాల్ అర్హత సాధించింది. ఆసియాకప్కు ముందు క్వాలిఫికేషన్ టోర్నీ నిర్వహించి అందులోని విజేతలను ప్రధాన టోర్నీ ఆడేందుకు అనుమతిస్తున్నారు. మొత్తం 15 దేశాలు ఆసియా కప్ టోర్నీలో భాగమవ్వగా.. 6 జట్లు మాత్రమే ఆసియాకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తున్నాయి.
అంతర్జాతీయ మ్యాచ్ల ఫలితాల ఆధారంగా 5 జట్లు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తుండగా.. మరో జట్టు క్వాలిఫికేషన్ టోర్నీలో విజేతగా నిలిచి క్వాలిఫై అవుతోంది. మరో 9 జట్లు క్వాలిఫికేషన్ టోర్నీలోనే వెనుదిరుగుతున్నాయి. ఒక్క శ్రీలంక మాత్రమే ఇప్పటి వరకు అన్నీ ఎడిషన్స్ ఆడింది.