భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్.. బౌండరీ లైన్ బయట కూర్చొని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. నాలుగో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'పాపం పిల్లోడికి తిండి కూడా పెట్టడం లేదు'అని, గుజరాత్ టైటాన్స్ను వదిలి సీఎస్కేలోకి రావాలని, 'తిండి కోసం పిల్లాడు అల్లాడుతున్నాడమ్మా' అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంప్బెల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను షార్ట్ లెగ్ ఫీల్డర్గా సాయి సుదర్శన్ అద్భుతంగా అందుకున్నాడు. కాంప్బెల్ బలంగా కొట్టిన బంతి నేరుగా సాయి సుదర్శన్ చేతిలో పడింది. కానీ అతని చేతికి బలమైన గాయమైంది. దాంతో మైదానం వీడిన సాయి సుదర్శన్.. మళ్లీ ఫీల్డింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద కూర్చొని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. డ్రెస్సింగ్ రూమ్లో తినలేకనో లేక.. ఆకలై తిన్నాడో తెలియదు కానీ ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

270 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో చెలరేగగా.. జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. జైడెన్స్ సీల్స్(32) కలిసి ఆఖరి వికెట్కు 79 పరుగులు జోడించాడు.
దాంతో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం నమోదైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/44), కుల్దీప్ యాదవ్(3/104) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది.