టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్పై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్.. టీమిండియా బౌలింగ్ సింహం అని కొనియాడాడు. అతని అంకిత భావం, పోరాట స్ఫూర్తి అద్భుతమన్నాడు. సిరాజ్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం టీమిండియా అదృష్టమని తెలిపాడు. ఎన్ని ఓవర్లు వేసినా అలిసిపోడని, జట్టు కోసం అదనపు బాధ్యత తీసుకునేందుకు ఎప్పుడూ ముందుంటాడని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన సిరాజ్ 32 సగటుతో 13 వికెట్లు తీసాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (6/70) ఆరు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ టెస్ట్లో బ్యాట్తోనూ జడేజాతో కలిసి టీమిండియా విజయం కోసం పోరాడాడు. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో భారత్కు ఓటమి తప్పలేదు. నాలుగో టెస్ట్ బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ర్యాన్ టెన్ డస్కాటే.. సిరాజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. ' మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం టీమిండియా అదృష్టం. ఒక ఫాస్ట్ బౌలర్గా అతని నుంచి మనం ఆశించే ఫలితం ఎప్పుడూ రాకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా చెబతున్నా అతను ఓ సింహం. అతను బంతిని అందుకున్న ప్రతీసారి ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. అతను ఎప్పుడూ వర్క్లోడ్ను తగ్గించుకునేందుకు ప్రయత్నించడు. అయితే అతని పనిభారాన్ని జాగ్రత్తగా సమన్వయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అతను అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి కావాల్సిన ఫిట్నెస్తో ఉన్నాడా? అనేది మేం నిర్దారించుకోవాలి. కొన్నిసార్లు అతను ఆడటానికి సిద్దంగా ఉన్నా.. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.'అని ర్యాన్ టెన్ డస్కాటే చెప్పుకొచ్చాడు.
మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్తో చివరి మ్యాచ్కు సంబంధించిన బౌలింగ్ కాంబినేషన్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ర్యాన్ టెన్ తెలిపాడు. 'మ్యాచ్ టైమ్ వరకు బౌలింగ్ కాంబినేషన్పై తుది నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ను ఆడించే విషయాన్ని పరిశీలుస్తున్నాం. అతను మా ప్రణాళికలో ఉన్నాడు. కానీ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తరహాలోనే సిరాజ్ ఎప్పుడూ ఎక్స్ట్రా ఓవర్ వేసేందుకు సిద్దంగా ఉంటాడు. ఇలాంటి అటిట్యూడ్తో ఉండే ఆటగాళ్లు చాలా అరుదు. కొన్నిసార్లు సిరాజ్ బాధ్యత తీసుకునే ప్రయత్నం చేసినా.. అడ్డుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది.'అని ర్యాన్ టెన్ డస్కాటే తెలిపాడు.
2023 నుంచి టీమిండియా 27 టెస్ట్ మ్యాచ్లు ఆడగా ఇందులో సిరాజ్ 24 మ్యాచ్లు ఆడాడు. అతను ఇప్పటి వరకు 569.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మరే భారత బౌలర్ కూడా ఇన్ని ఓవర్లు వేయలేదు. ఈ రెండేళ్ల సమయంలో ప్రపంచ క్రికెట్లో సిరాజ్ కంటే ముందు ప్యాట్ కమిన్స్(721.2 ఓవర్లు), మిచెల్ స్టార్క్(665.1) మాత్రమే ఎక్కువ బౌలింగ్ చేశారు. ఈ గణంకాలే సిరాజ్ ఫిట్నెస్కు అద్దం పడుతున్నాయి.