ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు.
ఇప్పటి వరకు సినీ రంగానికే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు.. క్రీడా రంగానికి కూడా అంటుకుంది. ప్రముఖ హీరోయిన్లు, హీరోల ఫొటోలతో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసిన ఆకతాయిలు.. ఇప్పుడు క్రీడాకారులపై డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు రూపొందిస్తూ శునకానందం పొందుతున్నారు.

ఇటీవలే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకున్నారని, వెకేషన్కు వెళ్లారంటూ కొన్ని ఫొటోలను ఏఐ సాయంతో క్రియేట్ చేసి వైరల్ చేశారు. షమీ-సానియా మీర్జా బీచ్లో దిగినట్లు ఫొటోలు రూపొందించారు. చాలా మంది ఇది నిజమేనని పొరబడ్డారు. చివరకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవన్నీ ఏఐ ఫొటోలని, ఇందులో వాస్తవం లేదని కథనాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కూడా ఏఐ ఆకతాయిల బారిన పడింది. ఆమెకు సంబంధించి కూడా కొన్ని ఫేక్ ఫొటోలను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో బీచ్లో రోమాన్స్ చేస్తున్నట్లు కొందరు ఆకతాయిలు ఫొటోలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే ఈ ఫొటోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీని తీసుకురావాలని కోరుతున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డాడు. ఏదో బెట్టింగ్ యాప్కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు వీడియో రూపొందించారు.