WTC Final: అందుకే హార్దిక్ పాండ్యాకు అవకాశం దక్కలేదు!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరుగుతుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పై వేటు పడింది.

పాండ్యాపై వేటు ఊహించలేదు..
ఇంగ్లండ్ పిచ్లు పేస్ బౌలింగ్కు అనుకూలం. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే భారత జట్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక సీమ్ ఆల్రౌండర్ అతనే. అయితే గత కొద్దిరోజులుగా బౌలర్గా కాకుండా పాండ్యా కేవలం బ్యాట్స్మన్గానే సేవలందిస్తున్నాడు. కనీసం టీ20 మ్యాచ్లోనూ అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఫిట్గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లీ పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అటు బ్యాట్స్మన్గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో టీమిండియా సెలెక్టర్ టెస్టు జట్టులో అతన్ని పక్కకు తప్పించారు.

బౌలింగ్కు సిద్దంగా లేకపోవడంతో..
2019 వరల్డ్ కప్ నుంచి అతను బౌలింగ్ చేసింది కూడా ఏం లేదు. సర్జరీ తర్వాత అతను బౌలింగ్ చేయడానికి సౌకర్యంగా కనిపించలేదు. దాంతో కేవలం బ్యాట్స్మన్గా ఎంపికచేయడానికి ఇష్టపడని సెలెక్టర్లు సంప్రదాయక ఫార్మాట్కు దూరం పెట్టారు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి కూడా ధృవికరించారు. 'హార్దిక్ పాండ్యా ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి సిద్దంగా లేడు. ఇంగ్లండ్తో సిరీస్కు అతన్ని ఎంపిక చేసి బౌలర్ల వర్క్లోడ్ తగ్గించాలనకున్న సెలెక్టర్ల వ్యూహం ఘోరంగా విఫలమైంది. దాంతో అతన్ని టెస్ట్ క్రికెట్కు పక్కనపెట్టారు.'అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు.

పృథ్వీకి నో చాన్స్..
జట్టులోకి వచ్చిన అక్షర్ లాంటి స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తుండడంతో ఇక కుల్దీ్పకు జాతీయ జట్టులో తలుపులు మూసుకుపోయినట్టుగానే భావించవచ్చు. అయితే పేసర్ భువనేశ్వర్ను టెస్టు జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించింది. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం. బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్కు ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగ్గా... సాహా కరోనా వైరస్ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు.

అదే జట్టు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దీమాన్ సాహా(ఫిట్నెస్ నిరూపించుకోవాలి).
స్టాండ్బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాలా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications