BCCI అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తెచ్చిన మార్పులు.. సాధించిన ఘనతలు ఏంటంటే..?

హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించలేదు. దాంతో అతని వారసుడిగా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ హీరో స్టువర్ట్ బిన్నీ బీసీసీఐ పగ్గాలను అందుకోనున్నాడు. అతనొక్కడే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఈ నెల 18న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా.. కీలక పదవులన్నింటినీ ఏకగ్రీవంగానే ఎన్నుకోనున్నారు.
బీసీసీఐ ప్రెసిడెంట్గా దాదా ఆశించిన రీతిలో రాణించలేదనే బోర్డు సభ్యులు మరోసారి అతన్ని కొనసాగించేందుకు ఇష్టపడలేదని ప్రముఖ వెబ్సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేసినా మద్దతు ఇవ్వమని గంగూలీకి గట్టిగా చెప్పినట్లు సమాచారం.

పింక్ బాల్ టెస్ట్కు ఓటేసి..
అయితే 2019లో బ్రిజేష్ పటేల్ను వెనక్కు నెట్టి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన దాదా.. తనదైన మార్క్ చూపెట్టాడు. టీమిండియా కెప్టెన్గా భారత జట్టులో ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చాడో.. బోర్డు అధ్యక్షుడిగా కూడా అదే దూకుడును కొనసాగించాడు. అయితే ప్రెసిడెంట్గా అతని కాలంలో కరోనా మహమ్మారి పెద్ద సవాల్గా మారగా.. బోర్డు అంతర్గత వ్యవహారాలు బజారుకెక్కడం అతన్ని మరింత ఇబ్బంది పెట్టాయి.
వైఫల్యాలను పక్కనబెడితే బోర్డు అధ్యక్షుడిగా దాదా చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చాడు. వచ్చి రావడంతోనే అప్పటి వరకు పింక్ బాల్ టెస్ట్కు వ్యతిరేకంగా ఉన్న భారత జట్టును ఆ దిశగా నడిపించాడు. 2019లో బంగ్లాదేశ్తో కోల్కతా వేదికగా పింక్ బాల్ టెస్ట్ నిర్వహించి... టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతీ సిరీస్లో ఓ పింక్ బాల్ మ్యాచ్ ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

వేతనాల పెంపు..
డొమెస్టిక్ క్రికెట్ వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా మాజీ క్రికెటర్లకు బోర్డు నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ క్లియర్ చేశాడు. బోర్డు అడ్మినిస్ట్రేషన్లోకి తన సహచరులు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్మణ్లను ఒప్పించి తీసుకొచ్చాడు. సుదీర్ఘ ప్రణాళికల నేపథ్యంలో ముందుగా ద్రవిడ్ను ఎన్సీఏ డైరెక్టర్గా నియమించి భారత్-ఏ, అండర్ 19 జట్ల కోచ్గా మేటీ ఆటగాళ్లను తీర్చిదిద్దేలా చేశాడు. మహిళల ఐపీఎల్పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఐసీసీ నుంచి బోర్డుకు రావాల్సిన రెవెన్యూపై పోరాటం చేశాడు.

కరోనాతో బిగ్ ట్రబుల్..
తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్న దాదాకు కరోనాతో పెద్ద సవాల్ ఎదురైంది. ప్రపంచ క్రికెట్ ఆగిపోయిన సందర్భంలో కఠిన బయో బబుల్స్తో దుబాయ్ వేదికగా ఐపీఎల్ను సక్సెస్ఫుల్గా నిర్వహించి ఇతర ఏ బోర్డులకు రానీ ఆదాయాన్ని రాబట్టాడు. ఐపీఎల్ 2021ను స్వదేశంలో నిర్వహించాలని భావించినప్పటికీ.. బయో బబుల్ బ్రేక్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా అంతర్జాతీయా క్రికెట్ షెడ్యూల్లో మళ్లీ ఐపీఎల్కు టైమ్ తీసుకొని దుబాయ్ వేదికగా సెకండాఫ్ నిర్వహించాడు. ఐపీఎల్ 2022ను సొంతగడ్డపై విజయవంతంగా ముగించాడు. బీసీసీఐకి కావాల్సిన రెవెన్యూను రాబట్టాడు.

రెండు జట్లతో..
ఒకే సమయంలో రెండు జట్లను ఆడించి బోర్డు రెవెన్యూను రెట్టింపు చేశాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లతో ద్వితీయ శ్రేణి జట్టును సిద్దం చేసి.. ద్రవిడ్, లక్మణ్లను కోచ్లుగా పంపించి సక్సెస్ఫుల్గా సిరీస్లను పూర్తి చేశాడు. మీడియా రైట్స్, ఐపీఎల్ కొత్త జట్ల ప్రక్రియ వంటి వాటితో బోర్డు కోట్ల ఆదాయం తెచ్చిపెట్టాడు. దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్ను కూడా దిగ్విజయంగా పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications