ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రెసిడెంట్ అర్శనపల్లి జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో స్టేడియంలోని ఏర్పాట్లపై సోమవారం హెచ్సీఏ కార్యవర్గ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్తో పాటు స్టేడియం రినోవేషన్కు సంబంధించిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(SJAT) 2025 వార్షిక డైరీని ఆవిష్కరించారు. ఈ డైరీని హెచ్సీఏ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాసరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్జాట్ అధ్యక్షడు ఆర్.కృష్ణా రెడ్డి, ఎం.శ్రీనివాస్ దాస్, ఉపాధ్యక్షుడు ఎస్.ఎస్బి సంజయ్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్, ఈసీ సభ్యులు జి.సునీల్ గౌడ్, అనిల్ యాదవ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

SRH ప్రాక్టీస్ షురూ..
ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తమ ప్రాక్టీస్ క్యాంప్ను ప్రారంభించింది. సోమవారం సన్రైజర్స్ ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. బ్యాటర్లు త్రో డౌన్స్తో పాటు నెట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్తో పాటు అభినవ్ మనోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఫీల్డింగ్ సెషన్ నిర్వహించగా.. ఆటగాళ్లంతా క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్తో స్టేడియంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు స్టేడియం పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. పెయింటింగ్ వర్క్తో పాటు టాయిలెట్స్ను రినోవేట్ చేస్తున్నారు.
22న క్రికెట్ పండుగ షురూ..
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఆరెంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. ఈ సారైన టైటిల్ గెలవాలనే లక్ష్యంతో సిద్దమవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ వేదికగానే ఆడనుంది. మార్చి 23, మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే10 తేదీల్లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరగనున్నాయి.