ఐపీఎల్ 2025 సీజన్కు ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ వేదికగా ఏడు లీగ్ మ్యాచ్లతో సహా రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని రూ. 5 కోట్లతో ముస్తాబు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. బుధవారం బీసీసీఐ, సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి జగన్ మోహన్ రావు గ్రౌండ్ రినోవేషన్ పనులను పరిశీలించారు.
మరో పది రోజుల్లో ఉప్పల్ వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుండడంతో పనుల్లో వేగం పెంచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. స్టేడియం మొత్తం పెయింటింగ్ వేస్తున్నామని, నార్త్ స్టాండ్స్లో కొత్త రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నామని, క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టైల్స్ మారుస్తున్నామని చెప్పారు. స్టేడియానికి కొత్త రూపు తెచ్చేందుకు హెచ్సీఏ నుంచి సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

సీఎస్ఆర్ పథకం కింద సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా సహకారం అందిస్తుందని జగన్ మోహన్ రావు తెలిపారు. జగన్ మోహన్ రావుతో పాటు బీసీసీఐ నుంచి వైభవ్, యువరాజ్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నుంచి శరవానణ్, రోహిత్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.