సమాజ శ్రేయస్సు, సామాజిక బాధ్యత వంటి విషయాల్లో జర్నలిస్టులను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కేఎస్జీ జర్నలిస్టు టీ20 ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) నాకౌట్ మ్యాచ్ల ప్రారంభానికి ఆయనతో పాటు హెచ్సీఏ సీనియర్ క్లబ్ సెక్రటరీ పురుషోత్తం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఎన్టీవీ రైజర్స్, వెలుగు జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్ను జగన్ మోహన్ రావు టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్ట్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. పూర్తి ప్రొఫెషనల్ పద్ధతిలో జేపీఎల్లో అన్ని హంగులతో నిర్వహించడం, క్రికెటర్లను తలదన్నేలా జర్నలిస్టులు ఆడుతుండడం చూస్తుంటే ముచ్చటేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం జరిగిన తొలి మ్యాచ్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన 'ఎన్టీవీ రైజర్స్' జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 163/6 స్కోరు చేసింది. ఛేదనలో వెలుగు జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేసి, పరాజయం పాలైంది. ఆల్రౌండర్ కిరణ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో మ్యాచ్లో నమస్తే నైట్రైడర్స్పై టీవీ-9 థండర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్ 9.3 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో థండర్స్ 5.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 51 పరుగులు చేసి నెగ్గింది. ఆల్రౌండర్ సత్యకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.