అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. అసలు సిసలు టెస్ట్ సమరానికి సిద్దమవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. జనవరి 25న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్తగా హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ మోహన్ రావు తన మార్క్ను చూపిస్తున్నారు. ముందుగా స్టేడియం రినోవేషన్పై ఆయన దృష్టి సారించారు. గత హెచ్సీఏ ప్యానెల్ అంతర్గత కుమ్ములాటతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కాకి రెట్టలు, విరిగిపోయిన కుర్చీలు సోషల్ మీడియాలో వైరల్గా మారి.. అంతర్జాతీయంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం పరువు పోయింది. ఈ క్రమంలోనే నూతన అధ్యక్షుడు స్టేడియం రిన్నోవేషన్ పనులను దగ్గరుండి చేయించారు. కొత్త సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పై కప్పులను నిర్మించారు. స్టేడియాన్ని కలర్ఫుల్గా మార్చారు.
ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ను కూడా రిన్నోవేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి టెస్ట్ కోసం చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు. అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనే సామన్యుడి కోరిక నెరవేర్చేందుకు టికెట్ ధరలు తగ్గించామని చెప్పారు.
అంతేకాకుండా హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులకు 5000 కాంప్లిమెంటరీ పాస్లు అందజేయనున్నామని, వారికి భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్యానెల్ మాదిరిగా గాకుండా.. ప్రస్తుత ప్యానెల్ సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ టీమ్ వర్క్ చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ మ్యాచ్కు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దావోస్ పర్యటన నుంచి రాగానే తమ ప్యానెల్ సీఎంను కలిసి మ్యాచ్కు హాజరవ్వాలని కోరుతామని చెప్పారు. జనవరి 23న హైదరాబాద్లోని పార్క్ హయత్లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుందని జగన్ మోహన్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, గవాస్కర్, కపిల్ దేవ్, ధోనీ తదితరులు హాజరవుతారని, వారంతా తొలి టెస్ట్కు కూడా రావచ్చని చెప్పారు. హెచ్సీఏ తరఫున క్రికెట్ దిగ్గజాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ క్యూరేటర్ కూడా మంచి పిచ్ను సిద్దం చేస్తున్నారని, ఇరు జట్ల మధ్య మంచి మ్యాచ్ జరుగుతుందన్నారు. 5 రోజుల పాటు మ్యాచ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు.