హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన జగన్మోహన్ రావుకు హైదరాబాద్ హై కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయాలతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.
నిధుల అక్రమాలు, అధికారిక దుర్వినియోగంతో పాటు మోసం వంటి పలు అభియోగాలతో జగన్మోహన్ రావు, సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి సీ జే శ్రీనివాస్తో పాటు సునీల్, రాజేందర్ యాదవ్, కవితలను తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్తో నెలకొన్న గొడవ చివరకు అరెస్ట్లకు దారి తీసింది. ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా అదనపు టికెట్లు ఇవ్వాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూశాయని, జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడటం నిజమేనని అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు.

ఈ రిపోర్ట్తో సీఐడీ పోలీసులు.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. విచారణలో జగన్మోహన్ రావు అక్రమంగా అసోసియేషన్లోకి వచ్చారని గుర్తించింది. నిధులను కూడా దుర్వినియోగం చేశారని పేర్కొంది. గత మూడు నెలలుగా కస్టడీలోకి తీసుకొని విచారణ చేయగా.. తాజాగా కోర్టు బెయిల్ ఇచ్చింది.
అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో జగన్ మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సీజే శ్రీనివాసరావుపై వేటు పడింది. ఈ ముగ్గురినీ కార్యవర్గం నుంచి సస్పెండ్ చేస్తూ జూలై 28న జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది.
కక్ష రాజకీయాల్లో భాగంగానే జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారని ఆయన సన్నిహితులు ఆరోపించారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు 2023 ఎన్నికైన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. హెచ్సీఏపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రావుపై అక్రమ కేసులు పెట్టి అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి హెచ్సీఏపై ఆరోపణల గుప్పించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తు చేస్తున్నారు.