ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024 ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యాష్ రివార్డ్ ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 10 లక్షల నజరానాతో పాటు అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మేఘాలయ టీమ్తో ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ గెలుపుతో హైదరాబాద్ జట్టు ఎలైట్ డివిజన్కు అర్హత సాధించింది. వచ్చే ఎడిషన్లో ఎలైట్ గ్రూప్లో పోటీ పడనుంది. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ జట్టు ఛాంపియన్గా టీమ్ మొత్తానికి కోటి రూపాయాల నజరానాతో పాటు ఒక్కో ప్లేయర్కు బీఎండబ్ల్యూ కార్ను బహుమతిగా అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రకటించారు.

ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా హెచ్సీఏ తరఫున తిలక్ సేనకు క్యాష్ రివార్డ్ ప్రకటించిన జగన్మోహన్ రావు.. రాబోయే మూడేళ్లలో విజేతగా నిలిస్తే భారీ నజరానాతో పాటు బహుమతులు అందజేస్తామని ఎక్స్వేదికగా వెల్లడించారు.
ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు.. హైదరాబాద్ క్రికెట్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పాలన వ్యవహారాల్లో తన మార్క్ పనితీరును కనబరుస్తున్నారు. దగ్గరుండి స్టేడియాన్ని పూర్తిగా రినోవేషన్ చేయించిన ఆయన.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ను విజయవంతంగా నిర్వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ పిల్లలు, భారత సైనికులకు భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్కు ఫ్రీగా ప్రవేశం కల్పించారు.
గతంలో గ్రూప్ రాజకీయాలతో హెచ్సీఏ పరువు రోడ్డున పడగా.. జగన్మోహన్ రావు ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా అసోసియేషన్ను అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్యానెల్స్తో సంబంధం లేకుండా టీమ్ వర్క్గా ముందుకు సాగుతున్నారు. ఆటగాళ్ల ఎంపికలోనూ ఎలాంటి అవతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దాంతోనే ఈ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటింది. ఓటమెరుగని జట్టుగా ప్లేట్ గ్రూప్లో ఛాంపియన్గా నిలిచింది. హెచ్సీఏ రాజకీయాల వల్ల గతేడాది పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఎలైట్ గ్రూప్ నుంచి ప్లేట్ గ్రూప్లోకి పడిపోయింది.
ఈ క్రమంలోనే మళ్లీ హైదరాబాద్ జట్టుకు ఇలాంటి పరిస్థితి రావద్దని జగన్మోహన్ రావు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాష్ రివార్డ్ ప్రకటించారు. రంజీ ట్రోఫీలో గెలిస్తే భారీ బహమతులు ఇస్తామని ఆటగాళ్లకు ఆఫర్ ఇచ్చారు.