
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్కు వ్యతిరేకంగా పావులు కదిపిన ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లపై వేటు పడింది. హెచ్సీఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, సెక్రటరీ విజయానంద్, జాయింట్ సెక్రటరీ నరేశ్ వర్మ, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధలపై అర్హత వేటు వేస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి దీపక్ వర్మ.. ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్సీఏ ప్రెసిడెంట్గా అజార్ కొనసాగుతాడని స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ హోదాలో తమ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు హెచ్సీఏ అడ్మినిస్ట్రేషన్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అజార్కు సూచించారు.
దీనిపై స్పందించిన అజార్.. అంబుడ్స్మన్ ఆదేశాల ప్రకారం రూల్ 41(1) ప్రకారం ఈ ఐదుగురు విచారణను ఎదుర్కోవాలని ఓ ప్రకటనను విడుదల చేశాడు. హెచ్సీఏ అడ్మినిష్ట్రేషన్ను సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పాడు. మరోవైపు అజార్ స్టేట్మెంట్ను విజయానంద్ తోసిపుచ్చాడు. తాము ఇప్పటివరకు దీపక్ వర్మను అంబుడ్స్మన్గా గుర్తించలేదన్నాడు. షెడ్యూల్ ప్రకారమే లోకల్ లీగ్స్ జరుగుతాయన్నాడు.
ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఐదుగురు ఆఫీస్ బేరర్స్.. ప్రెసిడెంట్ అజార్ను తొలగిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా జాన్ మనోజ్ను తాత్కలిక అధ్యక్షుడిగా నియమించారు. దీనిపై అజార్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు.
ఇక జింఖానా మైదానంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న తమని పోలీసులు అడ్డుకున్నారని అపెక్స్ సభ్యులు ఆరోపించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్పైఅపెక్స్ కౌన్సిల్ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అజారుద్దీన్ డిక్టేటర్గా వ్యవహరిస్తున్నారని, అంబుడ్స్మన్గా జస్టిస్ దీపక్వర్మను తాము వ్యతిరేకించినందుకు తమపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 3-డే లీగ్ నిర్వహించబోతున్నామని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. దానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుచేయబోతుంటే.. అజార్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.