
నలుగురు తిరుగుబాటు..
ఈ మేరకు దీపక్ వర్మకు ఈ నలుగురూ లెటర్ రాయడం చర్చనీయాంశమైంది. ఆకాపీని బీసీసీఐ సెక్రటరీ జైషాకు కూడా పంపించారు. ఆరుగురు సభ్యులతో కూడిన హెచ్సీఏ కార్యవర్గంలో నలుగురు ఆఫీస్ బేరర్లు తిరుగుబాటు చేయడంతో అజహర్ ఆత్మరక్షణలో పడినట్టైంది. ‘జూన్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అంబుడ్స్మన్ అపాయింట్మెంట్పై చర్చ జరిగిన మాట వాస్తవమే. హెచ్సీఏకు అంబుడ్స్మన్గా పని చేసేందుకు రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మ కూడా అంగీకరించారు. కానీ, హెచ్సీఏ రాజ్యాంగం ప్రకారం అంబుడ్స్మన్ను నియమించే అధికారం ఏజీఎంకు మాత్రమే ఉంటుంది.
ప్రెసిడెంట్ కానీ, నేను కానీ ఇష్టం వచ్చిన వాళ్లను నియమించడానికి లేదు. అంబుడ్స్మన్ జీతాన్ని కూడా ఏజీఎం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రెసిడెంట్ కు చెప్పాం. ఏజీఎం జరిగే వరకూ ఆగాలని కోరాం. కానీ, ఆయన వినిపించుకోలేదు. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. మా మధ్య వ్యక్తిగత గొడవలు లేవు. కానీ, ఆయనే దీన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు' అని హెచ్సీఏ సెక్రటరీ ఆర్. విజయానంద్ పేర్కొన్నారు.

కొడుకును తీసుకువెళ్లడంపై..
ఇక అజహర్ కొన్ని రోజుల క్రితం తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఐటీ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యాడు. ఉప్పల్ స్టేడియం లీజు గడువును పెంచాలని, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని కోరాడు. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో క్రికెటర్లను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)తో కలిసి పని చేసేందుకు హెచ్సీఏ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. అయితే, ఈ భేటీకి హెచ్సీఏ ఆఫీస్ బేరర్లెవరినీ అజర్ తీసుకెళ్లలేదు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పర్సనల్ మీటింగ్ మాదిరిగా కుమారుడిని వెంటబెట్టుకెళ్లడంపై మెంబర్స్ గుస్సా అయ్యారు. పైగా, స్టేడియం లీజు గడువు మరో ఆరేళ్లు ఉన్నా పనిగట్టుకొని మంత్రులను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

అందరం వెళ్దామన్నాం..
‘లీజు గడువు, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి అపెక్స్ కౌన్సిల్ లో చర్చించాం. మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటే అందరం వెళ్దామని అజర్కు సూచించాం. కానీ, ఆయన మాకు సమాచారం ఇవ్వకుండానే మినిస్టర్స్ను కలిశారు. అయినా లీజు, ట్యాక్స్ విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ జరిగినా దానిపై సెక్రటరీ హోదాలో నేనే సంతకం చేయాలి. ఇక, శాట్స్తో కలిసి పని చేయాలని అపెక్స్ కౌన్సిల్ లో చర్చే జరగలేదు. ఈ విషయంలో అజర్ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతం. హెచ్సీఏకు ఎలాంటి సంబంధం లేదు. అయినా బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మా సంఘం.. శాట్స్తో పని చేయడం నిబంధనలకు విరుద్ధం అవుతుంది' అని సెక్రటరీ విజయానంద్ పేర్కొన్నాడు.

క్రికెటర్ల గుడ్ బై..
ఇక అసోసియేషన్లో నెలకొన్న రాజకీయాలతో విసుగుచెందిన హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరు హెచ్సీఏను వీడుతున్నారు. టీమ్మెనేజ్మెంట్, అసోసియేషన్పై తీవ్ర విమర్శలు గుప్పించి రంజీట్రోఫీకి అంబటిరాయుడు దూరంగా ఉండగా.. తాజాగా స్టార్ క్రికెటర్, ఐపీఎల్లో సన్రైజర్స్ టీమ్కు ఎంపికైన బావనక సందీప్ కూడా హైదరాబాద్ ను వీడాడు. ఈ సీజన్లో గోవా టీమ్ తరఫున ఆడేందుకు హెచ్సీఏ నుంచి ఎన్ఓసీ తీసుకున్నాడు.
ఐపీఎల్కు సెలెక్ట్ అయినప్పటికీ.. ఈ డొమెస్టిక్ సీజన్లో అయినా అతనికి తుది జట్టులో చోటు గ్యారంటీ ఇచ్చే వాళ్లు కరువయ్యారు. దాంతో, ఈ యంగ్ క్రికెటర్ హైదరాబాద్ను వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, సందీప్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ హెచ్సీఏలో రగడ జరిగింది. అతను ఎన్ఓసీ కోరిన విషయం తనకు తెలియదని అజహర్ అంటుంటే... సందీప్ లెటర్ను ప్రెసిడెంట్కు వాట్సప్ చేసినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్ఓసీ జారీ చేశానని సెక్రటరీ విజయానంద్ తెలిపాడు.


Click it and Unblock the Notifications












