హైదరాబాద్: కేఎస్జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టీ20 టోర్నీ జెర్సీల ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. శనివారం ఉదయం సికింద్రాబాద్ జింఖానా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మాజీ హెచ్సీఏ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి, త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, లైఫ్ స్పాన్ సంస్థ స్పోర్ట్స్ హెడ్ భరణి, కేఎస్జీ సీఈఓ సంజయ్, హెచ్సీఏ సీనియర్ సభ్యులు ఆగంరావు, స్మయిల్గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్ఈడీ ఫౌండర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై జెర్సీలను ఆవిష్కరించారు.
ఈ టోర్నీలో మొత్తం పది మీడియా సంస్థల జట్లు పోటీ పడనున్నాయి. ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో 10 జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ క్రీడారంగం అభివృద్ధి, క్రీడాకారుల అభ్యున్నతికి నిత్యం పరితపించే జర్నలిస్టులే ఇలా ప్లేయర్లగా మారిపోయి, గ్రౌండ్లోకి దిగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

ఈ టోర్నీ విజయవంతం కావాలని అన్ని జట్లకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. మాజీ హెచ్సీఏ ప్రెసిడెంట్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జర్నలిస్టులతో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. పాత్రికేయలు తనకు మిత్రులు కాదని, కుటుంబ సభ్యులు వంటి వారని తెలిపారు. సమాజ హిత కోసం వారు చూపించే చొరవ అందరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.

జేపీఎల్ టోర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జేపీఎల్ ఇతర లీగ్లకు ఒక ట్రెండ్సెట్టర్గా నిలవాలని, ఆ స్థాయిలో జర్నలిస్టులు అద్భుతంగా ఆడి, అందరికి ప్రేరణగా నిలవాలని భరత్ రెడ్డి ఆకాంక్షించారు.