హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మళ్లీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. రోజుకో వివాదంతో హెచ్సీఏ అప్రతిష్టపాలవుతోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్తో చోటు చేసుకున్న టికెట్ల వివాదంపై దేశవ్యాప్తంగా హెచ్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్తో హెచ్సీఏ చర్చలు జరిపి గొడవకు ముగింపు పలికింది.
ఈ టికెట్ల గొడవను మరిచిపోతున్న తరుణంలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు అధికార దుర్వినియోగం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తండ్రి అండదండలతో సునీల్ అగర్వాల్ తనయుడు ఖుష్ అగర్వాల్ ఉప్పల్ స్టేడియంలో హల్చల్ చేస్తున్నారు. స్నేహితులతో కలిసి స్టేడియానికి వెళ్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఏకంగా తండ్రి చైర్లోనే కూర్చుని స్నేహితులతో బాత్కాలు కొడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా స్టేడియంలో రీల్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. హెచ్సీఏ అండర్ 19 ప్లేయర్ అయిన ఖుష్ అగర్వాల్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తండ్రి సునీల్ అగర్వాల్ అపెక్స్ కౌన్సిల్లో ఉండగా.. ఖుష్ అగర్వాల్ హెచ్సీఏ అండర్-19 జట్టుకు ఎంపికకావడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కింద ఈ ఇద్దరు తండ్రి కొడుకులపై ఎథిక్స్, అంబుడ్స్మన్కు ఫిర్యాదులు కూడా అందాయి. తన వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో ఖుష్ అగర్వాల్ తన రీల్స్ను తొలగించారు.
సాధారణంగా వాహన పాసులున్న కార్లు, ద్విచక్ర వాహానాలను కూడా స్టేడియంలోకి అనుమతించని హెచ్సీఏ సెక్యూరిటీ సిబ్బంది, కౌన్సిల్ కొడుకు, వారి స్నేహితులకు మాత్రం గేట్ దగ్గర నుంచే వీఐపీ ప్రోటోకాల్ ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.