ఆలిండియా బుచ్చి బాబు టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ క్రికెట్ టీమ్కు హెచ్సీఏ(హైదరాబాద్ క్రికెటస్ అసోసియేషన్) భారీ నజరానా ప్రకటించింది. ఈ భారీ విజయానికి గుర్తింపుగా జట్టు మొత్తానికి రూ. 25 లక్షల క్యాష్ రివార్డ్ అందజేసింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో హైదరాబాద్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఛత్తీస్ఘడ్తో బుధవారం ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీ ఛాంపియన్స్ను హెచ్సీఏ సన్మానించింది. శుక్రవారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగ్గా.. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై క్యాష్ రివార్డ్ అందజేశారు. హైదరాబాద్ టీమ్ సాధించిన ఈ విజయంతో నగరం మొత్తం గర్వపడుతుందని, వారి కష్టానికి గుర్తింపుగా అసోసియేషన్ నుంచి రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధికారులతో పాటు టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు.

దుమ్మురేపుతున్న హైదరాబాద్..
గత కొంతకాలంగా హైదరాబాద్ జట్టు నిలకడగా రాణిస్తోంది. రంజీ ట్రోఫీ 2024 ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్..ఎలైట్ డివిజన్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా బుచ్చిబాబు టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ముంబై వంటి ప్రతిష్టాత్మక జట్లు పాల్గొన్న బుచ్చి బాబు టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలు నమోదు చేసింది. అప్కమింగ్ డొమెస్టిక్ సీజన్ ముందు సాధించిన ఈ విజయం హైదరాబాద్ జట్టుపై అంచనాలను పెంచుతున్నాయి.
చిత్తయిన ఛత్తీస్ఘడ్..
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 118.4 ఓవర్లలో 417 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ రాయుడు(260 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 155) భారీ శతకం నమోదు చేయగా... ఓపెనర్ అభిరథ్(126 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 85) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రాహుల్ రాదేష్(48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఛత్తీస్ఘడ్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే కుప్పకూలింది. అనికేత్ రెడ్డి(4/56), తనయ్ త్యాగరాజన్(3/40), రోహిత్ రాయుడు(3/36) ఛత్తీస్ఘడ్ పతనాన్ని శాసించారు. గగన్ దీప్ సింగ్(59 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. దాంతో హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 236 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఈ భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 70.2 ఓవర్లలో 281 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాహుల్ రాదేష్(41) విలువైన పరుగులు చేశాడు. ఛత్తీస్ఘడ్ బౌలర్లలో జీవేష్ బుట్టే(6/56) ఆరు వికెట్లతో సత్తా చాటాడు.
518 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఛత్తీస్ఘడ్ 274 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 117) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్(5/61) ఐదు వికెట్లతో ఛత్తీస్ఘడ్ పతనాన్ని శాసించాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికేత్ రెడ్డి(2/55) రెండు వికెట్లు తీయగా.. రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ తీసారు.