హైదరాబాద్: హెచ్సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్) మూడు రోజుల లీగ్లో అప్కమింగ్ బ్యాటర్ శ్రేయస్ వాల సంచలన ప్రదర్శన కనబర్చాడు. బీడీఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా సిమెంట్స్ తరఫున బరిలోకి దిగిన శ్రేయాస్ వాల డబుల్ సెంచరీతో చెలరేగాడు. 238 బంతుల్లో 22 ఫోర్లు, 6 సిక్సర్లతో 204 పరుగులు చేశాడు.
ఇండియా సిమెంట్స్ బ్యాటర్లు సత్తా చాటడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన బీడీఎల్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ శ్రేయస్ వాలా డబుల్ సెంచరీతో 475 పరుగులు చేసింది.

అతనికి తోడుగా శశాంక్ యాదవ్(43) రాణించాడు. బీడీఎల్ బౌలర్ శ్రీముఖ్ రెడ్డి(5/104) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బీడీఎల్ ఆట ముగిసేసరికి 13/1 నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితం తేలకున్నా మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇండియా సిమెంట్స్కు మూడు పాయింట్లు దక్కాయి.
ఇతర మ్యాచ్ల్లో కూడా చాలా వరకు ఫలితం తేలకుండానే ముగిసాయి. జై హనుమాన్ క్రికెట్ క్లబ్ టీమ్పై జెమినీ ఫ్రెడ్స్ క్రికెట్ క్లబ్ విజయం సాధించింది. జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్లో 324 పరుగులు చేయగా.. జై హనుమాన్ టీమ్ 94 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆ జట్టు 169 పరగులకే కుప్పకూలి ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది.