టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై అతని మాజీ సతీమణి హాసిన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తమ బిడ్డ ఐరాపై మహమ్మద్ షమీ చూపించేది దొంగ ప్రేమని, ఆమెను అతను అస్సలు పట్టించుకోడని తెలిపింది. మహమ్మద్ షమీ ఇటీవలే తన కూతురు ఐరాను కలిసాడు.
హసిన్ జహాన్తో విడాకుల అనంతరం చాలా రోజులకు ఐరాను కలుసుకున్నాడు. దాంతో షమీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరూ కలిసి సరదాగా షాపింగ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

'చాలా రోజుల తర్వాత నా కూతుర్ని చూశాను. నా బంగారు తల్లిని కలిసినప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఐరా.. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను.'అని షమీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.
అయితే ఈ వీడియోపై అతని మాజీ భార్య హాసిన్ జహాన్ ఘాటుగా స్పందించింది. కూతుర్ని షమీ అస్సలు పట్టించుకోడని, కేవలం షో ఆఫ్ చేయడానికి ఈ వీడియో షేర్ చేశాడని మండిపడింది. 'ఇది కేవలం షో ఆఫ్ మాత్రమే.. నా కూతురు పాస్పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్పోర్ట్ కోసం షమీ సంతకం కావాల్సి వచ్చింది. అందుకే ఐరా తన తండ్రిని కలవడానికి వెళ్లింది.
అయితే అక్కడ షమీ సంతకం చేయకుండా ఆమెను షాపింగ్కు తీసుకెళ్లాడు. అక్కడ తాను ఎండార్స్ చేసే బ్రాండెడ్ షూస్, బట్టలు మాత్రమే కొనిచ్చాడు. ఆ కంపెనీకి చెందిన వస్తువులు ఏవీ కొన్నా.. వాటికి షమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆ షాపింగ్ మాల్కు తీసుకెళ్లాడు. కానీ నా కూతురు గిటార్, కెమెరా కొనివ్వాలని అడిగింది. కానీ ఆ వస్తువులను షమీ కొనివ్వలేదు.
మహమ్మద్ షమీ తన కూతురి గురించి అస్సలు పట్టించుకోడు. షమీ తనతో మాత్రమే బిజీగా ఉంటున్నాడు. ఒక నెల క్రితమే ఐరాను కలిసాడు. అప్పుడు ఎలాంటి పోస్ట్ షేర్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేశాడో అతనికే తెలియాలి. 'అని హసిన్ జహాన్ ఘాటుగా వ్యాఖ్యానించింది.