ఆ 10 ఓవర్లే మా కొంపముంచాయి: అఫ్గాన్ కెప్టెన్
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో తొలి 10 ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయామని తెలిపాడు. ఈ మ్యాచ్లో ఓడినా.. సెంచరీ చేసినందుకు వ్యక్తిగతంగా ఆనందన్నిచ్చిందన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్.. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్లో అఫ్గాన్ 0-3తో క్లీన్ స్వీప్ అయ్యింది.
ఆ 10 ఓవర్లే మా ఓటమిని శాసించాయి..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హష్మతుల్లా షాహిదీ.. ఈ సిరీస్లో ఓడినా చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్పాడు. 'ఈ రోజు తొలి 10 ఓవర్లలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. దాంతో మేం వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడ్డాం. ఆ తర్వాత నేను, అజ్మత్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. కానీ ఆ పార్ట్నర్షిప్ తర్వాత మళ్లీ వెంటవెంటనే వికెట్లు కోల్పోయాం. దాంతో కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం.

దాదాపు 95 మ్యాచ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేను నా తొలి వన్డే సెంచరీని సాధించాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్షా అల్లాహ్.. ఇవాల్టి నుంచి నా దేశం కోసం ఇలాంటి ప్రదర్శనలు మళ్లీ మళ్లీ చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో నాకు కండరాలు పట్టేసాయి. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను.
తప్పిదాలను గుర్తిస్తాం..
మా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ భారత జట్టుతో వారి సొంత గడ్డపై ఆడటం ఎప్పుడూ కష్టమైన విషయమే. మేం ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మేం అంత గొప్పగా ఆడలేదు. మాది నాణ్యమైన జట్టే అయినప్పటికీ.. గత ఎనిమిది నెలలుగా వన్డే క్రికెట్కు దూరంగా ఉన్నాం. చివరిగా గతేడాది బంగ్లాదేశ్తో ఆడాం. తదుపరి సిరీస్ను ఐర్లాండ్తో ఆడబోతున్నాం. తాజా సిరీస్లో మా లోపాలను గుర్తించి.. వాటిపై పని చేస్తాం. మా కోచ్ కూడా కొత్తగా వచ్చారు. మేమంతా ఒక జట్టుగా కలిసి కష్టపడటానికి ప్రయత్నిస్తాం.'అని హష్మతుల్లా షాహిదీ చెప్పకొచ్చాడు.
శతక్కొట్టిన యశస్వీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(131 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 102) సెంచరీతో చెలరేగగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఐదు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 221 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

