అప్కమింగ్ పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్) తాము మెరుగైన ప్రదర్శన చేస్తే.. జనాలు ఐపీఎల్ను చూడటం ఆపేస్తారని పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ అన్నాడు. పీఎస్ఎల్ 10వ సీజన్కు ఎల్లండి( ఏప్రిల్ 11) తెరలేవనుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలాండర్స్ తలపడనున్నాయి.
గత 10 ఏళ్లలో ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రీడా టోర్నీల్లోనే మోస్ట్ పాపులారిటీని సొంతం చేసుకున్న రెండో టోర్నీగానూ ఐపీఎల్ నిలిచింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. గత 18 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. ఎంతో మంది స్టార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. బ్రాండ్ వాల్యూ ప్రకారం కూడా ఐపీఎల్ టాప్. పీఎస్ఎల్ కనీసం పోటీకి కూడా రాదు. తాజాగా ఐపీఎల్, పీఎస్ఎల్ వ్యూయర్షిప్ గురించి మాట్లాడిన హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఐపీఎల్కు మంచి వ్యూయర్షిప్ ఉంటుంది. ఈ సారి మేం ఐపీఎల్తో పోటీ పడుతున్నాం. పీఎస్ఎల్ నిర్వహించేందుకు మాకు ఉన్న సమయం కూడా ఇదే. ఆటగాళ్ల ప్రదర్శన, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మేం పీఎస్ఎల్ బాగా ఆడితే.. ఐపీఎల్ను వదిలేసి మా మ్యాచ్లను చూస్తారు. ఇదంతా పీఎస్ఎల్ జరిగే తీరుపై ఆధారపడి ఉంటుంది.'అని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో విఫలమైన తమ ఆటగాళ్లకు పుంజుకునేందుకు పీఎస్ఎల్ మంచి అవకాశమని కూడా హసన్ అలీ అభిప్రాయపడ్డాడు. తమ అభిమానుల ముఖాల్లో చిరునవ్వుల తీసుకొచ్చేందుకు పీఎస్ఎల్ మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు.
'జాతీయ జట్టు బాగా ఆడనప్పుడు ఆ ప్రభావం పీఎస్ఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్పైన ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, న్యూజిలాండ్ పర్యటనలో మా ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. మా జట్టులో కొత్త కుర్రాళ్లు ఉన్నారు. వారు సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ పడుతోంది. పాకిస్థాన్ జట్టు బాగా రాణిస్తే.. పీఎస్ఎల్ గ్రాఫ్ కూడా పెరుగుతుంది. అప్కమింగ్ సీజన్లో మా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తాం.'అని హసన్ అలీ చెప్పుకొచ్చాడు.