క్రికెట్లో ఆస్ట్రేలియా ఎంత పవర్ఫుల్ జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురుషుల క్రికెట్ అయినా.. మహిళల్లో అయినా ఆస్ట్రేలియా జట్టుకు తిరుగు లేదు. పురుషుల క్రికెట్లో ఐసీసీ టైటిళ్లన్నీ గెలవడంతో పాటు అత్యధిక ట్రోఫీలు అందుకున్న ఏకైక టీమ్గా ఆసీస్ చరిత్ర సృష్టించింది.
ఏకంగా 6 వన్డే ప్రపంచకప్(1987, 1999, 2003, 2007, 2015, 2023)ట్రోఫీలను గెలుచుకున్న ఆస్ట్రేలియా.. ఒక టీ20 ప్రపంచకప్ (2021), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2023), రెండు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(2006, 2009), ఐసీసీ సూపర్ సిరీస్(2005)తో మొత్తం 11 టైటిళ్లను అందుకుంది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు 13 సార్లు ఐసీసీ టైటిల్స్ అందుకుంది. వన్డే ప్రపంచకప్ను(1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) ఏడు సార్లు గెలిచిన ఆసీస్ మహిళల టీమ్.. 6 సార్లు(2010, 2012, 2014, 2018, 2020, 2023) టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఇంత ఘనమైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా జట్లు గత రెండేళ్లుగా ఐసీసీ టైటిల్ అందుకునేందుకు తడబడుతున్నాయి.

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీని చివరి సారిగా ఆస్ట్రేలియా పురుషుల జట్టు గెలవగా.. మహిళల టీమ్ అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఐదు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగగా.. ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది.
అయితే ఆసీస్కు టైటిల్ శాపం తగలిందని, దాంతో ట్రోఫీని గెలవలేకపోతుందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పురుషుల వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆసీస్ స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాలు పెట్టి దిగిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. అప్పట్లో ఈ ఫొటోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టైటిల్ కాళ్లు పెట్టడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. కాళ్లు పెట్టి ట్రోఫీని అవమానించడంతోనే ఆ జట్టుకు మరో ట్రోఫీ దక్కడం లేదని తాజాగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ టోర్నీ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఖంగుతిన్నది. తాజాగా మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడింది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను చేజార్చుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆసీస్.. మూడు ఈజీ క్యాచ్లను వదిలేసింది. ఫీల్డింగ్కు పెట్టింది పేరు అయిన ఆసీస్.. క్యాచ్లు వదిలేయడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ట్రోఫీపై కాలుపెట్టిన పాపమే ఆసీస్ను వెంటాడుతుందని అభిప్రాయపడుతున్నారు.