టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ హర్షిత్ రాణా వివాదంలో చిక్కుకున్నారు. మైదానంలో తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాడిపై నోరు పారేసుకున్నారు. సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 135) సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఔటైన తర్వాత హర్షిత్ రాణా, విరాట్ కోహ్లీ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా ప్రత్యర్థి ఆటగాడి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ సెండాఫ్ ఇవ్వగా.. అతనికి కోహ్లీ వత్తాసు పలికాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్తో రెండు వికెట్లు తీసాడు. స్టన్నింగ్ డెలివరీలతో ర్యాన్ రికెల్టన్(0), క్వింటన్ డికాక్(0)లను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు.

ఆ వెంటనే ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను అర్ష్దీప్ సింగ్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దూకుడుగా ఆడాడు. తనదైన బ్యాటింగ్తో సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్లో అతను కొట్టిన నోలుక్ సిక్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా మారింది. దాంతో అసహనానికి గురైన హర్షిత్ రాణా.. అతనికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
తాను వేసిన 22వ ఓవర్లో వరుసగా మూడు బంతులు డాట్ చేసాడు. ఒత్తిడికి గురైన డెవాల్డ్ బ్రెవిస్(37) నాలుగో బంతికి చెత్త షాట్తో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో హర్షిత్ రాణా ఎగిరి గంతేసాడు. పెవిలియన్ వైపు నడుస్తున్న డెవాల్డ్ బ్రెవిస్పై నోరు పారేసుకున్నాడు. క్రీజు నుంచి వెళ్లాలని సైగలు చేస్తూ సెండాఫ్ ఇచ్చాడు. కోహ్లీ కూడా అతనికి వత్తాసు పలుకుతూ అతిగా సంబరాలు చేసుకున్నాడు. యువ ఆటగాడైన బ్రెవిస్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.
ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాటర్ ఔటైన తర్వాత అతిగా ప్రవర్తించడం నేరం.ఇప్పటికే ఐపీఎల్లో ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్తో హర్షిత్ రాణా ఓ మ్యాచ్లో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ బ్యాటర్లను రెచ్చగొట్టేలా అసభ్యకర సైగలు చేస్తున్నాడు. తాజా ఘటనతో హర్షిత్ రాణాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అతని మ్యాచ్ ఫీజులో కోత విధించడం లేదా డీమెరిట్ పాయింట్స్ కేటాయించడం, మందలించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. విరాట్ కోహ్లీని కూడా మ్యాచ్ రిఫరీ హెచ్చరించే అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 135) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, నండ్రే బర్గర్, కార్బిన్ బోష్, ఒట్నిల్ బార్ట్మన్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రిట్జ్కే(80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 72), మార్కో జాన్సెన్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70), కార్బిన్ బోష్(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా(3/65) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్(2/64)కు రెండు వికెట్లు దక్కాయి.