Harshit Rana: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. యువ పేసర్ హర్షిత్ రాణా గాయంతో జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్లో హర్షిత్ రాణా మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ మ్యాచ్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 16 పరుగులు ఇచ్చాడు. ఆ సమయంలోనూ రెండు సార్లు తన రనప్ను ఆపాడు.
తన కుడి మోకాలిని పట్టుకుని తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. అయితే హర్షిత్ రాణా కుడి మోకాలి జాయింట్లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్లలోనూ ఆ విషయం వెల్లడైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. వైద్యుల సూచన మేరకు హర్షిత్ రాణా మెటా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హర్షిత్ రాణా గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మెగా టోర్నీకి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ను హర్షిత్ రాణా గాయం గురించి ప్రశ్నించగా.. అవునని బదులిచ్చాడు. 'హర్షిత్ రాణా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం మాకు ఈ రోజే తెలిసింది. ఒకవేళ హర్షిత్ రాణా జట్టుకు దూరమైతే.. అది మాకు పెద్ద నష్టం. మేం వేరే కాంబినేషన్లను ప్రయత్నిస్తాం. అయితే మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
హర్షిత్ రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్ను భారత సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన జట్టులో సభ్యుడైన సిరాజ్, హర్షిత్ స్థానంలో జట్టుతో చేరడానికి ఇప్పటికే ముంబై చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హర్షిత్ రాణా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇదే విషయాన్ని కెప్టెన్ సూర్య ముందు ప్రస్తావించగా.. జట్టులో ఇప్పటికే నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారని, బౌలింగ్ విభాగంలో పటిష్టత కోసం ఉత్తమమైన బౌలర్ను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆ క్రమంలో సిరాజ్కు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అయితే మహమ్మద్ షమీని ఎంపిక చేసినట్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మరికొద్ది గంటల్లోనే హర్షిత్ రాణా గాయంపై అధికారిక ప్రకటన రావచ్చు. అప్పుడే అతని స్థానంలో ఎంపికైన బౌలర్ ఎవరా? అనేది తెలియనుంది.