టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల గైడెన్సీతోనే రాణించానని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా(3/48).. ఫస్ట్ మ్యాచ్లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు.
డేంజరస్ ట్రావిస్ హెడ్ను క్లీన్ బౌల్డ్ చేసిన రాణా.. నాథన్ లయన్(5)తో పాటు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన మిచెల్ స్టార్క్(26)లను పెవిలియన్ చేర్చాడు. హర్షిత్ రాణా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన హర్షిత్ రాణా.. తన అద్భుత ప్రదర్శన క్రెడిట్ బుమ్రా, కోహ్లీలకు ఇచ్చాడు.

'జస్ప్రీత్ బుమ్రా తరుచూ నాతో మాట్లాడుతూ ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో సలహాలు ఇచ్చాడు. విరాట్ భాయ్ సైతం కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరి గైడెన్స్ నాకు చాలా సహకరించింది. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ భాయ్ తరుచూ నాతో మాట్లాడుతూ.. ఎక్కడ బౌలింగ్ చేయాలి? ఏ లైన్లో వేయాలో చెప్పారు. వారి సలహాలతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అంతేకాకుండా నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు? ఇంకా బాగా బంతులు సంధిస్తావ్ అని ప్రోత్సహించారు.'అని హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. అంతకుముందు 67/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు మిచెల్ స్టార్క్(112 బంతుల్లో 2 ఫోర్లతో 26), అలెక్స్ క్యారీ(31 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రా(5/30) ఐదు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/48) మూడు వికెట్లు.. మహమ్మద్ సిరాజ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లతు, సిక్స్తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 37), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.