
అబుదాబి: ముంబై ఇండియన్స్పై హ్యాట్రిక్ వికెట్ తీసిన ఆనందంలో తన సహచర ఆటగాళ్లను గాయపర్చానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ పేసర్ హర్షల్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్లో భాగంగా గత ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ తీసిన విషయం తెలిసిందే. అతను వేసిన 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్ వరుస బంతుల్లో ఔటయ్యారు. దాంతో ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్గా హర్షల్ పటేల్ గుర్తింపు పొందాడు. ఓవరాల్గా 20వ బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్న హర్షల్ పటేల్.. హ్యాట్రిక్ తీసిన ఆనందలో తన సహచర ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ను గాయపర్చానని తాజాగా వెల్లడించాడు.
తాను హ్యాట్రిక్ సంబరాల్లో ఉండగా తన చేతులు విరాట్ కోహ్లీ తొడలకు గీసుకుపోయాయని, సిరాజ్ కాలిని బలంగా తొక్కానన్నాడు. అయితే తన తప్పిదం తెలుసుకున్న వెంటనే సిరాజ్ గాయంపై ఆరా తీసానన్నాడు. 'అదృష్టవశాత్తు సిరాజ్కు పెద్ద గాయమేం కాలేదు. నా సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే అతని గాయంపై ఆరాతీశాను. అతనికేం కాలేదని చెప్పాడు. హ్యాట్రిక్ సెలెబ్రేషన్ సందర్భంగా విరాట్ కోహ్లీ తొడలకు నా చేతి వేళ్లు గీసుకుపోయాయి. నా సంబరాలతో వారిని ఇబ్బంది పెట్టాను'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.
టీ20 ఫార్మాట్లో పరిస్థితులను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. ఆ సామర్థ్యం నాకుంది. విభిన్నమైన పరిస్థితులు, కండిషన్స్ను నేను అద్భుతంగా అందిపుచ్చుకుంటా. దుబాయ్లో మైదానాలు చాలా పెద్దగా ఉండటంతో పాటు వికెట్లు నెమ్మదిగా ఉంటాయి. ఈ మైదానాలు నా బౌలింగ్కు సరిగ్గా సరిపోతాయి. నా ఆలోచనా విధానం, జట్టులోని నా పాత్ర ఏం మారలేదు. కండిషన్స్కు తగ్గట్లు కొద్దిగా మైండ్సెట్ చేసుకున్నా. డెత్ ఓవర్లలో ఎలాంటి బంతులు వేయాలో అర్థం కాదు. అయితే నా రనప్ సమయంలోనే ఏలాంటి బంతి వేయాలో ముందే నిర్ణయించుకుంటా.'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.