ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ(0) గోల్డెన్ డక్ అయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ధోనీని క్లీన్ బౌల్డ్ చేసినా.. హర్షల్ పటేల్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. రెండు చేతులూ పైకి లేపి ఔట్ అన్నట్లు నిలబడ్డాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం హర్షల్ పటేల్ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోనీపై ఉన్న గౌరవంతోనే సంబరాలు చేసుకోలేదని తెలిపాడు.
'నాకు ధోనీ అంటే చాలా గౌరవం. అందుకే అతడి వికెట్ తీసినా సెలెబ్రేట్ చేసుకోలేదు.'అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. పిచ్ విషయంలో తాను పొరబడినట్లు కూడా హర్షల్ పటేల్ కూడా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నట్లు భావించానని, కానీ చాలా నెమ్మదిగా ఉందని చెప్పాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో, 4 ఫోర్లు, సిక్స్తో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో, 2 ఫోర్లు, సిక్స్తో 30) కీలక పరుగులు సాధించారు.
శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24)తలో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), శశాంక్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.