సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్కు గురైన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. అయితే ప్తెర్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్లోనే తొలి రెండు మ్యాచ్లకు రోహిత్ అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ నుంచి రోహిత్ శర్మ పర్మీషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే విషయంపై సందేహం వ్యక్తం చేశాడు.

రెండో బిడ్డ కోసం..
అయితే తొలి రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటానికి గల కారణాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే వెల్లడించాడు. రోహిత్ శర్మ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని, ఆ చిన్నారికి స్వాగతం పలికేందుకే రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనలోని తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదన్నాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే గర్భవతి అని తెలుస్తోంది. రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దంగా ఉందని, ఈ నెల చివరి వారంలో లేదా..? డిసెంబర్ మొదటి వారంలో రితికా సజ్దే తన రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రచారం జరుగుతోంది. డెలివరీ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.
మ్యాచ్లకు దూరంగా రితికా..
భారత్లో రోహిత్ శర్మ ఆడే ప్రతీ మ్యాచ్కు హాజరయ్యే రితికా సజ్డే.. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కనిపించలేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన సమయంలోనూ రోహిత్ పక్కనలేదు. ఇటీవల ముంబై వేదికగా జరిగిన మ్యాచ్కు రితికా హాజరు కాగా.. ఆమె గర్భవతి అనే విషయం స్పష్టమైంది. రోహిత్ శర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనిస్తున్నారనే వార్తలను హర్షా భోగ్లే కూడా ధృవీకరించాడు.
రోహిత్, రితికాకు 2018లో ఆడబిడ్డ పుట్టింది. ఆమెకు సమైరా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆమె వయసు 6 ఏళ్లు. గతంలో విరాట్ కోహ్లీ సైతం తన సతీమణి అనుష్క శర్మ డెలివరీ సమయంలో పక్కనే ఉండేందుకు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 పర్యటనలో తొలి మ్యాచ్ ఆడి స్వదేశం వచ్చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు.