
ఆశలు రేకెత్తించిన పంత్
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 2 వికెట్లకు 98 పరుగులు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరారు. చివరి రోజు కెప్టెన్ రహానే (4) కూడా ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా పోరాటం ఇక ఎక్కువసేపు ఉండదన్న అంచనాకు అందరూ వచ్చారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రిషబ్ పంత్ చెలరేగాడు. మొదట్లో ఆచితూచి ఆడిన పంత్.. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పుజారాతో కలిసి నాలుగో వికెట్కు 148 పరుగులు జోడించి టీమిండియాకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. కాసేపటికే పుజారా (77) కూడా ఔట్ కావడంతో టీమిండియా గట్టెక్కుతుందా అన్న అనుమానాలు కలిగాయి. ఇక జడేజా బొటనవేలికి గాయం కావడంతో.. అతడు బ్యాటింగ్ చేస్తాడో లేదో కూడా తెలియదు. దీంతో భారత్ ఓటమి ఖాయమనుకున్నారు.

ఎంతో సహనంతో బ్యాటింగ్
అయితే విహారి, అశ్విన్ అందరి అంచనాలను తలక్రిందులు చేశారు. చివరి సెషన్లో వారు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు మ్యాచ్కే హైలైట్. చివరి సెషన్లో 36 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లకు విసుగు తెప్పించేలా వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. కంగారులను ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా విహారి చివరి వరకూ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. మధ్యలో తొడ కండరాల గాయం వేధించినా.. ఆస్ట్రేలియా ఫీల్డర్లు పదే పదే స్లెడ్జింగ్కి దిగినా ఏకాగ్రత చెదరనివ్వలేదు. అశ్విన్తో కలిసి దాదాపు మూడు గంటలకిపైగా క్రీజులో నిలిచిన విహారి గొప్ప పోరాట పటిమని కనబర్చాడు. పరుగులను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం క్రీజులో పాతుకుపోవడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
విహారి దూకుడుగా ఆడి ఉంటే
తొలి ఇన్నింగ్స్లో 38 బంతులాడిన విహారి.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్దే రనౌటయ్యాడు. దాంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్, పుజారా ఔట్ అయిన అనంతరం డిఫెన్స్ ఆడుతుండడంతో కొంత మంది నెటిజన్లు పెదవి విరిచారు. అయితే నెటిజన్లకు ఆ తర్వాత తెలిసింది విహారి ఏం చేశాడనేది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టం, 272 పరుగులకే ఐదు టాప్ ఆర్డర్ వికెట్లు చేజారిన తర్వాత.. డ్రా కోసం ప్రయత్నించడం మేలు. అదే హనుమ విహారి చేశాడు. ఒకవేళ విహారి కాస్త దూకుడుగా ఆడి ఔటై ఉండింటే.. మిగిలిన నాలుగు వికెట్లు తీయడం ఆస్ట్రేలియా బౌలర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చు.
మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు
ఒకవైపు గాయం వేధిస్తున్నా.. హనుమ విహారి ఆడిన అద్భుత ఇన్నింగ్స్కు యావత్ భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇక తెలుగు ఫాన్స్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ట్విట్టర్ వేదికగా విహరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గోదావరి బిడ్డ మ్యాచ్ గెలిపించాడు, మా ఆంధ్రా కుర్రాడు గెలిపించాడు అని కామెంట్లు చేస్తున్నారు. విహారి పట్టుదలకి కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ఫిదా అయిపోయాడు. 'విజయలక్ష్మీ గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' అని విహారి తల్లిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. భోగ్లే భాగ్యనగరంలో పుట్టిపెరిగిన విషయం తెలిసిందే. విహారి డిఫెన్స్పై ఓ నెటిజన్ నెగటివ్గా కామెంట్ చేయగా.. 'విహారి తొడ కండరాలకి గాయమైంది. అతడు పరుగెత్తలేడు. అయినా టీమిండియా కోసం ధైర్యంగా మ్యాచ్ ఆడాడు' అని భోగ్లే పంచ్ ఇచ్చాడు.
Sydney Test: 125 బంతులకు ఫోర్ బాదిన విహారి.. 40 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!!


Click it and Unblock the Notifications












