
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, తెలుగు క్రికెటర్ హనుమ విహారి జిడ్డు ఆట ఆడాడు. ఎంతలా అంటే.. 125 బంతులకు గాని ఓ బౌండరీ బాధలేదు. ఎట్టకేలకు పాట్ కమిన్స్ వేసిన 121వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాది బౌండరీల ఖాతా తెరిచాడు. అదే ఓవర్లోని నాలుగో బంతికి మరో బౌండరీ బాదాడు. మొత్తంగా విహారి 161 బంతుల్లో 23 రన్స్ చేశాడు. ఒక భారత బ్యాట్స్మన్ నెమ్మదైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. డ్రా చేయాలనే ఉద్దేశంతోనే విహారి ఇంత నెమ్మదిగా ఆడాడు.
సిడ్నీ టెస్టులో హనుమ విహారి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విహారి 112 బంతుల్లో కేవలం 7 పరుగులే చేశాడు. దీంతో అతడి స్ట్రైక్రేట్ 6.25గా నమోదైంది. అంతకుముందు 1980/81 సీజన్లో యశ్పాల్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపైనే 157 బంతుల్లో 13 పరుగులే చేశాడు. ఆ మ్యాచ్లో యశ్పాల్ కూడా 112 బంతులాడాక 7 పరుగులే చేయడం గమనార్హం. దీంతో 40 ఏళ్ల తర్వాత విహారి ఆ అరుదైన రికార్డును అందుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్లో భారత్ సోమవారం 407 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కొనసాగించగా.. ఆదిలోనే కెప్టెన్ అజింక్య రహానే (4) వికెట్ కోల్పోయింది. అనంతరం రిషబ్ పంత్ (97), చేటేశ్వర్ పుజారా (77) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నాలుగో వికెట్కు 148 పరుగులు జోడించారు. అయితే సెంచరీకి చేరువైన పంత్.. నాథన్ లైయన్ బౌలింగ్లో కమిన్స్ చేతికి చిక్కాడు.
మరికొద్దిసేపటికే పుజారా సైతం హేజిల్వుడ్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక వికెట్ల పతనం మొదలై.. ఆసీస్ విజయం సాధిస్తుంది అనుకున్నారు అందరూ. అయితే విహారి, ఆర్ అశ్విన్ (39; 128 బంతుల్లో 7x4) ఆ అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ చెక్కు చెదరని ఏకాగ్రత, దృఢసంకల్పం ముందు ఆసీస్ బౌలర్లు తలవంచక తప్పలేదు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 258 బంతులాడి 62 పరుగులు జోడించడం విశేషం. దాదాపు అసాధ్యమనుకున్న మ్యాచ్లో రహానే సేన డ్రాతో గట్టెక్కిన తీరు ఓ అద్భుతమనే చెప్పాలి. కీలకమైన సమయంలో ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్లు జారవిడవడం కూడా ఇండియన్ టీమ్కు కలిసొచ్చింది.