ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సంచలన ట్వీట్ చేశారు. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి సిద్దంగా ఉందని చెప్పారు. ఈ రెండు ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నారని, పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికాలో ఎవరికి ఈ జట్లు దక్కుతాయో అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇప్పటికే ఐపీఎల్ 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్సీబీని హోంబాలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేస్తుందని, డీల్ కూడా పూర్తయిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారుగా 2 బిలియన్ల అమెరికా డాలర్లుగా(రూ.17000 కోట్లు) ఉంటుందని అంచనా. డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు ఆర్సీబీ ఫర్ సేల్ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశమవుతుండగానే హర్షా గోయెంకా రాజస్థాన్ రాయల్స్ సేల్ విషయాన్ని బయటపెట్టారు. ' ఐపీఎల్ జట్లలో ఒకటి కాదు.. రెండు జట్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్లు నేను విన్నాను. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ రెండు జట్లను కొనుగోలు చేసేందుకు నలుగురు లేదా ఐదుగురు బయ్యర్స్ సిద్దంగా ఉన్నారు. ఈ రెండు జట్లను ఎవరు కొనుగోలు చేస్తారో? పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికాకు చెందిన వ్యక్తులే కొనుగోలు చేస్తారా? 'అని హర్షా గోయెంకా ట్వీట్ చేశారు. ఫ్రాంచైజీ సేల్ విషయంపై ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్ 2026 సీజన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.