ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ సీజన్ ఆడటం లేదని వెల్లడించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే మరో 9 రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. తాను ఆడలేనని హ్యారీ బ్రూక్ ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చాడు. హ్యారీ బ్రూక్ నిర్ణయంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తనకు ఎందుకు వచ్చిందో హ్యారీ బ్రూక్ ఎక్స్వేదికగా వెల్లడించాడు. తన అమ్మమ్మ ఫిబ్రవరిలో మరణించిందని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అవసరం తనకు ఉందని చెప్పాడు.
'అప్ కమింగ్ ఐపీఎల్ సీజన్ ఆడవద్దనే కఠిన నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూశాను. అయితే నేను తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న కారణం చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా మంది నేను ఎందుకు తప్పుకున్నానో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను.
గత నెలలో నేను మా అమ్మమ్మను కోల్పోయాను. నా చిన్నతనం మొత్తం నేను ఆమెతోనే గడిపాను. మా అమ్మమ్మ, తాతలే నన్ను క్రికెట్ వైపు నడిపించారు. ఓ అంతర్జాతీయ క్రికెటర్గా తీర్చిదిద్దారు. అమ్మమ్మ లేకుండా ఇంట్లో ఉండటం చాలా కష్టంగా ఉంది. ఇంగ్లండ్ తరఫున నా ఆటను ఆమె చూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం.
గత కొన్నేళ్లుగా నేను సాధించిన అవార్డ్స్ను ఆమె కలెక్ట్ చేసుకొని మురిసిపోయింది. టెస్ట్ సిరీస్ కోసం భారత్కు బయల్దేరే ముందే మా అమ్మమ్మ అనారోగ్యానికి గురైంది. దాంతో నేను ఆ సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాను. ఆమె మరణంతో మా కుటుంబం తీవ్ర దు:ఖంలో ఉంది.
ఈ కఠిన సమయంలో నేను కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉంది. నాకు నా కుటుంబం కన్నా ఏదీ ఎక్కువ కాదు. నా నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ నేను తీసుకుంది సరైన నిర్ణయమే. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు ఈసీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మద్దతుగా నిలిచాయి. నా నిర్ణయానికి గౌరవం ఇచ్చాయి.'అని హ్యారీ బ్రూక్ తన సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నాడు.