ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా భారత అభిమానులను ఉద్దేశించి తాను చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశానని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అన్నాడు. అభిమానుల జోలికి పోకుండా ఉండాల్సిందన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్ను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో భారత అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేశారు. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ట్రోలర్స్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన శతకంతో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయన్నాడు.

ఈ కామెంట్స్తో మరింత ఆగ్రహానికి గురైన ట్రోలర్స్... టోర్నీ ఆసాంతం హ్యారీ బ్రూక్ను ఇబ్బంది పెట్టారు. అతను కూడా ఆ మ్యాచ్ తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై స్పందించిన హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'భారత అభిమానులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. అప్పుడు నేను ఓ ఇడియట్లా ప్రవర్తించాను. ఆ తర్వాత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చొని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్స్ ఎన్నో చూశాను.

అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టాను. దాంతో నా మానసిక ఆరోగ్యం కాస్త కుదుటపడింది.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. మొత్తం 11 ఇన్నింగ్స్ల్లో హ్యారీ బ్రూక్ 190 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
దాంతో అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలోకి వదిలేసింది. ప్రస్తుతం అతను వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో 71 పరుగులతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది.