తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై కనక వర్షం కురుస్తోంది. దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత స్వస్థలాలకు చేరుకున్న ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నగదు ప్రోత్సాహకాల అందజేత కొనసాగుతోంది.
ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 51 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది. ఈ నజరానాకు అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, క్రికెట్ అసోసియేషన్స్ భారీ క్యాష్ ప్రైజ్తో సత్కరిస్తున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంలో భాగమైన భారత మహిళా క్రికెటర్లలో ఎవరెవరికి ఎలాంటి సత్కారం, పురస్కారం లభించిందో తెలుసుకుందాం.

భారత మహిళా క్రికెట్ టీమ్లో మరే ప్లేయర్కు దక్కని జాక్ పాట్ లెఫ్టార్మ్ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీచరణికి దక్కింది. శ్రీచరణికి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, ఏసీఏ ప్రెసిడెంట్, ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తన నివాసంలో కలిసిన శ్రీ చరణికి ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు వరాల జల్లు కురిపించారు.
ఆటగాళ్ల సంతకాలతో కూడిన ప్రపంచకప్ ఫైనల్ జెర్సీని చంద్రబాబుకు శ్రీచరణికి అందజేసింది. ఆమె ఆటకు ఫిదా అయిన చంద్రబాబు.. రూ. 2.5 కోట్ల క్యాష్ ప్రైజ్తో పాటు కడపలో 1,000 చదరపు గజాల నివాస స్థలం, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. భారత మహిళల జట్టులో ఏ ప్లేయర్కు కూడా ఈ స్థాయిలో రివార్డ్ లభించలేదు.
తమ రాష్ట్రానికి చెందిన స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్లకు రూ. 2.25 కోట్ల చొప్పున నగదు బహుమతిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఆయన స్వయంగా ప్లేయర్లను సత్కరించారు. తమ రాష్ట్రానికే చెందిన హెడ్ కోచ్ అమోల్ ముజుందార్కు రూ. 22.5 లక్షలు, బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వి, మాజీ దిగ్గజం డయానా ఎడుల్జీ, అనలిస్ట్ అనిరుద్ద దేశ్ పాండే, అపర్ణ గంభీర్, మిహిర్ ఉపాధ్యాయ్, పూర్వ కాటే, మమత షిరురుల్లాలకు ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున బహుకరించారు.
క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఆమె తండ్రిపై ఉన్న పాత సస్పెన్షన్ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. కాంత్రి గౌడ్కు ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన దీప్తికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి యాబై లక్షలు నజరానా ప్రకటించింది.
క్రాంతి గౌడ్కు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించగా.. స్నేహ్ రాణాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు బహుమతి ఇస్తామని తెలిపింది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) రూ. 11 లక్షల నజరానా ప్రకటించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు(శనివారం నాటికి) ఎలాంటి రివార్డ్స్ ప్రకటించలేదు. ఉమా ఛెత్రికి అస్సాం ప్రభుత్వం రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్ను బహుకరించింది.
అరుంధతి రెడ్డి(తెలంగాణ), షెఫాలీ వర్మ (హర్యానా), దీప్తి శర్మ(ఉత్తరప్రదేశ్), రిచా ఘోష్(పశ్చిమ బెంగాల్), హర్లీన్ డియోల్(పంజాబ్)లకు ఇప్పటి వరకు(శనివారం నాటికి) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి క్యాష్ రివార్డ్స్ ప్రకటించలేదు. కేవలం సత్కారాలతో సరిపెట్టారు. రిచా ఘోష్కు మాత్రం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గోల్డెన్ బ్యాట్తో పాటు బాల్ను బహుమతిగా అందజేసింది.