భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత మహిళా ప్లేయర్గా నిలిచింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డ్ను హర్మన్ప్రీత్ కౌర్ అధిగమించింది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన ఐదో టీ20 ద్వారా హర్మన్ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాదించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడినా.. సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో హర్మన్ప్రీత్ బ్యాటర్గా విఫలమైనా.. కెప్టెన్గా రికార్డ్ సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది.
అయితే హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 182వ టీ20 కాగా.. 334వ అంతర్జాతీయ మ్యాచ్. ఇందులో 142 వన్డేలతో పాటు 6 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్ నిలిచింది. 1999-2019 మధ్య మిథాలీ రాజ్ 333 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మహిళా క్రికెట్లో హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ తర్వాత జులాన్ గోస్వామి(284), స్మృతి మంధాన, దీప్తి శర్మ(239)లు ఉన్నారు. లేడీ సెహ్వాగ్గా గుర్తింపు పొందిన 36 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ తన కెరీర్లో 8 శతకాలతో పాటు 85 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. అత్యధిక స్కోర్ 171. మహిళల వన్డే క్రికెట్లో ఇది టాప్ పర్సనల్ స్కోర్.

ఓవరాల్గా అత్యధిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడిన మహిళా క్రికెటర్లలో హర్మన్ప్రీత్ కౌర్ మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ 346 మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ(337) హర్మన్ ప్రీత్ కౌర్ కంటే ముందున్నారు.
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా శనివారం అర్థరాత్రి జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిచా ఘోష్(24) పర్వాలేదనిపించింది. స్మృతి మంధాన(8), హర్మన్ప్రీత్ కౌర్(15) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. సోఫీయా డంక్లీ(46), డానీ వ్యాట్(56) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఓ వికెట్ తీసాడు.