దుబాయ్: ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. వికెట్లను బ్యాట్తో కొట్టిన టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొరడా ఝులిపించనుంది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం హర్మన్ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.
హర్మన్ప్రీత్ కౌర్ ప్రవర్తనను లెవెల్-2 తప్పిదంగా గుర్తించిన ఐసీసీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు క్రిక్బజ్ పేర్కొంది. బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ సహనం కోల్పోయింది. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడని అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్తో వికెట్లను కొట్టింది.

అంతటితో ఆగకుండా అంపైర్లను బండ బూతులు తిడుతూ మైదానం వీడింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అంపైర్ల తప్పిదాలను ప్రస్తావించింది. చెత్త అంపైరింగ్ అని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. మరోసారి బంగ్లాదేశ్ వచ్చే ముందు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకొని వస్తామని సెటైర్లు పేల్చింది.
ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కాగా... క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఐసీసీ రెడీ అవుతోంది. మైదానంలో తప్పుగా ప్రవర్తించినందుకు 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు విధించాలని నిర్ణయించిన ఐసీసీ.. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్లో అంపైర్ల నిర్ణయాలను తప్పుబట్టడంపై ఓ డీమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజులో మరో 20 శాతం కోత విధించేందుకు సిద్దమైంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం 12 నెలల్లో నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడకుండా నిషేధిస్తారు. ఈ లెక్కన హర్మన్ ప్రీత్ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే ఆమె రెండు మ్యాచ్లు నిషేధం ఎదుర్కొనుంది.
ఇరు జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన మూడో వన్డే చివరకు ఫలితం తేలకుండా టైగా ముగిసింది. దాంతో సిరీస్ను ఇరు జట్లు పంచుకున్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ ప్రవర్తనపై బంగ్లాదేశ్ ప్లేయర్లతో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలుస్తున్నారు. చెత్త అంపైరింగ్ అని మండిపడుతున్నారు.