ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత బ్యాటర్ల వైఫల్యం ఓటమిని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియో వోల్(57 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 88), బెత్ మూనీ(39 బంతుల్లో 4 ఫోర్లతో 46) టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి(2/30) రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్(1/27) ఒక వికెట్ తీసాడు.
అనంతరం భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(30 బంతుల్లో 5 ఫోర్లతో 36), స్మృతి మంధాన(24 బంతుల్లో 4 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లే గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, అన్నబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్ రెండేసి వికెట్లు తీసారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 శనివారం జరగనుంది.

ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచింది. ఈ మ్యాచ్ హర్మన్ప్రీత్కు కెరీర్లో 356వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ను అధిగమించింది. న్యూజిలాండ్ తరఫున సుజీ బెట్స్ 355 మ్యాచ్లు ఆడింది. ఎల్లిస్ పెర్రీ(349), మిథాలీ రాజ్(333), చార్లోట్ ఎడ్వర్డ్స్(309) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో హర్మన్ప్రీత్ కౌర్, ఎల్లిస్ పెర్రీ, సుజీ బేట్స్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నారు. మిగతా ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారు.
హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 189వ టీ20 మ్యాచ్. 2009 అరంగేట్రం చేసిన హర్మన్ప్రీత్.. 29.33 సగటుతో 3784 పరుగులు చేసింది. 2009 వన్డే ప్రపంచకప్తో 50 ఓవర్ల ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన హర్మన్.. 161 మ్యాచ్ల్లో 7 శతకాలతో 4409 పరుగులు చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు 6 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. హర్మన్ సారథ్యంలోనే భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్ 2025 గెలిచింది. ఆమె మూడు టెస్ట్లతో పాటు 48 వన్డేలు, 134 టీ20ల్లో భారత్కు సారథ్యం వహించింది.