అనవసర తప్పిదాలతోనే మహిళల ఆసియాకప్ 2024 ఫైనల్లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన తాము కీలక ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యామని అసహనం వ్యక్తం చేసింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో తొలిసారి ఆసియా కప్ టైటిల్ను ముద్దాడింది. ఈ మ్యాచ్లో ముందుగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. రిచా ఘోష్(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30), జెమీమా రోడ్రిగ్స్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 29) ధాటిగా ఆడారు.

శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్ హరి రెండు వికెట్లు తీయగా..సచిని, చమరి ఆటపట్టు, పరబోధని తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
కెప్టెన్ చమరి ఆట పట్టు(43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 61), హర్షితా సమరవిక్రమా(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కవిషా దిల్హరి(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హర్మన్ప్రీత్ కౌర్.. ప్రణాళికలకు తగ్గట్లు రాణించలేకపోయామని చెప్పింది. 'ఈ టోర్నీలో మేం అసాధారణ ప్రదర్శన కనబర్చాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కీలక ఫైనల్లో చాలా తప్పిదాలు చేశాం. అవి మా ఓటమిని శాసించాయి. మేం విధించిన లక్ష్యం పోరాడదగినదే.
పవర్ ప్లేలోనే శ్రీలంకను దెబ్బతీయాలనుకున్నాం. కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. శ్రీలంక బ్యాటర్లు సైతం అద్భుతంగా ఆడారు. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో మేం చాలా విషయాల్లో మెరుగవ్వాలి. మేం మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమిని మేం గుర్తుంచుకుంటాం. ఈ టోర్నీలో శ్రీలంక అద్భుతమైన క్రికెట్ ఆడింది.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.