కీలక సమయంలో స్మృతి మంధాన ఔటవ్వడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోసారి ఒత్తిడిని తట్టుకోలేక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను హర్మన్ప్రీత్ సేన చేజార్చుకుంది. ఈ ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హర్మన్ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. ఈ పరాజయం చాలా బాధకు గురిచేసిందని చెప్పింది. 'నా అభిప్రాయం ప్రకారం స్మృతి మంధాన ఔటవ్వడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మంధాన ఔటైనా.. జట్టును గెలిపించే సత్తా కలిగిన బ్యాటర్లు చాలా మంది ఉన్నారని నేను అనుకున్నాను. కానీ పరిస్థితులు ఒక్కసారిగా ఎలా చేయి దాటిపోయాయో అర్థం కావడం లేదు. కానీ ఈ గెలుపు క్రెడిట్ ఇంగ్లండ్దే. వాళ్లు పట్ట వదలకుండా నిలకడగా బౌలింగ్ చేశారు. కావాల్సిన సమయంలో వికెట్లు పడగొట్టారు.

ఈ ఓటమి చాలా బాధకు గురి చేసింది. ఎందుకంటే మేం చాలా కష్టపడ్డాం. విజయానికి కావాల్సిన ప్రతీది చేశాం. కానీ ఆఖరి 5-6 ఓవర్లలో మా బ్యాటింగ్ ప్రణాళిక ప్రకారం సాగలేదు. ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. గివప్ చేయడం లేదు. కానీ చివరి గీతను ధాటలేకపోతున్నాం. గత మూడు మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాం. తదుపరి మ్యాచ్ మాకు చాలా కీలకం. ఆ మ్యాచ్లోనైనా విజయం సాధిస్తామని ఆశిస్తున్నా.
మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాట్ స్కివర్, హీథర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మా బౌలర్లు కట్టడిగా బంతులేసారు. ఇంగ్లండ్ను 300 లోపు కట్టడి చేస్తే మాకు కలిసొస్తుందని భావించాం. ఎందుకంటే ఈ పిచ్, గ్రౌండ్ చాలా వేగంగా ఉంది. సునాయసంగా లక్ష్యాన్ని చేధించగలమని భావించాం. అందుకే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. చాలా విషయాలు సరిగ్గానే చేశాం. కానీ మళ్లీ ఆఖరి ఐదు ఓవర్ల ఆటే మా ఓటమిని శాసించింది. ఈ బలహీనతపై మేం గ్రూప్గా కూర్చొని మాట్లాడుకోవాలి.
అదనపు బ్యాటర్ ఉంటే బాగుండా? అంటే ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. స్మృతి, నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. స్మృతి వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆమె ఔటైనప్పటికీ రిచా, అమన్ జోత్, దీప్తి గెలిపిస్తారని భావించా. గతంలో మాకు మ్యాచ్లు గెలిపించారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ రోజు వారు రాణించలేకపోయారు. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే విజయం కోసం గట్టిగా పోరాడాం. కానీ విజయాన్ని అందుకోలేకపోయాం. తదుపరి మ్యాచ్లోనైనా విజయం సాధించే ప్రయత్నం చేస్తాం.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.