హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మాటలే తమకు స్పూర్తిని కలిగించాయని టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. 339 పరుగుల లక్ష్యాన్ని చేధించగలమనే భరోసా ముజుందార్ తన మాటలతో కల్పించాడని చెప్పుకొచ్చింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ఈ విజయానంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన హర్మన్ప్రీత్ కౌర్.. హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పెప్ టాక్ గెలవాలనే కసిని పెంచిందని చెప్పుకొచ్చింది. అమోల్ ముజుందార్తో కలిసి స్టార్ స్పోర్ట్స్తో ప్రత్యేకంగా మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'ఇంగ్లండ్తో ఓటమి తర్వాత నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మా కోచ్ ముజుందార్ మాట్లాడారు. 'మీరు మ్యాచ్ను గెలిపించి ఉండాల్సింది.'అని అన్నారు. ప్రతీ ఒక్కరు ఆయన మాటలను సానుకూలంగా తీసుకున్నారు. మా కోచ్ ఏది చెప్పినా మేం నమ్ముతాం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ హృదయపూర్వకంగా మాట్లాడుతారు. ఆ తర్వాతే నేను ఆటగాళ్లతో చర్చిస్తాను. వారు ఏం ఫీల్ అవుతున్నారో నేను తెలుసుకుంటాను. మా కోచ్ ఎప్పుడూ మా నుంచి సానుకూల ఫలితాలనే ఆశిస్తారు. ఆయనే కాదు ఈ దేశం మొత్తం అదే ఆశిస్తోంది. జట్టులో ప్రతీ ఒక్కరు సానుకూలంగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో నేటి మ్యాచ్లో ఆ మార్పును చూడవచ్చు.'అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది.

అంతకుముందు ఈ గెలుపు గురించి మాట్లాడేందుకు మాటలు రావడం లేదని హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. 'ఈ గెలుపు పట్ల చాలా గర్వంగా ఉంది. నా భావాలను వ్యక్తపరిచేందుకు మాటలు రావడం లేదు. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ధాటని గీతను అధిగమించాం. విజయం తర్వాత మా కోచ్తో ఇదే చెప్పాను. ఈ గెలుపు కోసం మా కోచ్తో పాటు నేను చాలా కష్టపడ్డాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలవగలమనే నమ్మకం మాకు ఉంది. ఈ టోర్నీలో మేం కొన్ని పొరపాట్లు చేశాం. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం.
ఇంగ్లండ్తో మ్యాచ్లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో ఆ తప్పిదాన్ని సవరించుకున్నాం. కొన్ని ఓవర్ల ముందే మ్యాచ్ను ముగించాం. జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది. ఆమె ఎప్పుడూ జట్టు క్షేమం కోరుకునే వ్యక్తి. లెక్క ప్రకారం ఆడుతోంది. జట్టు విజయంలో బాధ్యత తీసుకోవాలని ఆరాటపడుతోంది. ఆమెపై మాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉంది.
మేం ఇద్దరం అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాం. ఐదు పరుగులు వచ్చాయి.. ఇంకా రెండు బంతులు ఉన్నాయని జెమీమా చెబుతూ ఉంటుంది. ఆమెతో బ్యాటింగ్ భలే ఉంటుంది.ఆమె ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. ఈ గెలుపు క్రెడిట్ ఆమెదే.
మా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకో మ్యాచ్(ఫైనల్) ఉంది. ఈ రోజు మేం బాగా ఆడాం. ఫలితం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. కానీ తదుపరి మ్యాచ్ గురించి మాట్లాడటం మొదలు పెట్టాం. ఇది మా ఫోకస్ ఎలా ఉందో తెలియజేస్తోంది. ప్రపంచకప్ గెలవడానికి ఎంత కసితో ఉన్నామనే విషయాన్ని సూచిస్తుంది. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడటం చాలా ప్రత్యేకం. గెలిచినా.. ఓడినా ప్రేక్షకులు అండగా నిలిచారు. వారికి ప్రపంచకప్ టైటిల్ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.