ఈ ఏడాది(2025) తమకు అద్భుతంగా సాగిందని భారత మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. వన్డే ప్రపంచకప్ గెలవడంతో పాటు చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నామని సంతోషం వ్యక్తం చేసింది. నూతన సంవత్సరంలో టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ తదుపరి లక్ష్యమని చెప్పుకొచ్చింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడింది.
'ఈ ఏడాది(2025) మాకు అద్భుతంగా సాగింది. మా కష్టానికి ఈ ఏడాది తగిన గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం మేం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాం. మేం చాలా టీ20 క్రికెట్ ఆడాం. మా స్ట్రైక్రేట్లు, ప్రమాణాలను పెంచడం గురించి మా కోచ్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేం ఆ ప్రమాణాలను నెలకొల్పాలనుకున్నాం.

భవిష్యత్తులో ఈ సిరీస్ విజయాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. ఒక బ్యాటర్గా జట్టుకు బలాన్ని అందించడం నా బాధ్యత. వన్డేల నుంచి టీ20లకు మారడం అంత సులువు కాదు. కానీ ఆడటానికి ప్రతీ ఒక్కరూ ఎంతో ఉత్సాహం చూపించారు. ఈ సిరీస్ గెలిచేందుకు మేం కష్టపడ్డాం. అన్నీ అనుకున్నట్లు జరిగినందుకు సంతోషంగా ఉంది. మాకు ఎంతో ముఖ్యమైన డబ్ల్యూపీఎల్ను ఆస్వాదిస్తాం. వచ్చే 6 నెలలు మాకు చాలా కీలకం. మేం కష్టపడి పనిచేస్తూ మా ప్రమాణాలను మరింత పెంచుకోవాలనుకుంటున్నాం.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్(43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, శ్రీ చరణి, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.